గత రెండేళ్లుగా నరసరావుపేట అసెంబ్లీ స్థాన టీడీపీ ఇంచార్జ్ పదవికి జరుగుతున్న మూడు ముక్కలాట గత నెల రోజుల్లో
అయిదు ముక్కలాట కాగా, గడిచిన రెండు రోజుల్లో మరో ముక్క చేరింది. ఆ ముక్క పేరే జంగా కృష్ణమూర్తి.
2019 లో టీడీపీ తరుపున పేట నుండి పోటీ చేసి ఓడిపోయిన అరవింద బాబు నాటి నుండి టీడీపీ ఇంచార్జ్ గా కొనసాగుతుండగా, దీర్ఘ కాలంగా టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న డాక్టర్ కడియాల వెంకటేశ్వర రావు కుటుంబం నుండి, అలాగే నల్లపాటి రాము అనే నాయకుడి నుండి కూడా టీడీపీ టికెట్ తమకు కేటాయించాలని డిమాండ్ వినిపించసాగింది. వీరిలో అరవింద బాబు బీసీ కాగా, కడియాల, నల్లపాటి ఇరువురు కమ్మ సామాజిక వర్గం కావడంతో కుర్చీలాటలో పెద్ద పీట నల్లపాటి, లేదా కడియాల కావొచ్చని అందరూ ఊహించారు.
అయితే చంద్రబాబు మాత్రం ఎవరికి తేల్చిచెప్పకుండా పని చేసుకోండి మీ భవిష్యత్తు నాది అనే హామీతో రెండేళ్లు అందరిని తిప్పి చివరిలో తన మార్క్ రాజకీయానికి తెర లేపాడు. కొద్ది కాలం క్రితం పల్నాడు జిల్లా అభ్యర్థుల ఎంపికకు సంభందించి జరిగిన టీడీపీ అంతర్గత సమావేశంలో అరవింద్ బాబు గెలిచే అవకాశం లేదని, నల్లపాటి, కడియాలకు సీట్ ఇవ్వకపోయినా కమ్మ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ కొచ్చిన నష్టం లేదని, రెడ్డి సామాజిక వర్గం నుండి అభ్యర్థిని ప్రకటిస్తే గట్టి పోటీ ఇవ్వచ్చని వ్యక్తమైన అభిప్రాయాలతో ఏకీభవించిన బాబు
వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న అట్లా చిన్న వెంకట రెడ్డిని సంప్రదించటంతో పాటు టీడీపీ అభ్యర్థిగా విజయావకాశాలు ఎలా ఉంటాయి అనే దాని పై టెలి కాల్స్ ద్వారా పేట ప్రజల ఒపీనియన్స్ తీసుకోవటం మొదలు పెట్టారు.
దీనిలో భాగంగా అట్లా చిన్న వెంకట రెడ్డి పేరుతో పాటు అరవింద బాబు పేరుని కూడా చేర్చిన టీడీపీ అధిష్టానం మూడవ అభ్యర్దిగా ఎవరూ ఊహించని పత్తిపాటి పుల్లారావు పేరు కూడా చేర్చడంతో పుల్లారావుకి చిలకలూరిపేట టికెట్ లేదని, కడియాల, నల్లపాటిలకు నరసరావుపేట టికెట్ లేదని తేలిపోయింది. ఇలా అయిదు కుర్చీలాట అయ్యిన టీడీపీ అభ్యర్థిత్వంలో నుండి నల్లపాటి, కడియాల రూపంలో రెండు కుర్చీలు తగ్గిపోయి అరవింద బాబు, వెంకట రెడ్డి, పుల్లారావు మిగలగా ఎవరూ ఊహించని విధంగా మరో కృష్ణుడు కుర్చీతో వచ్చి చేరాడు
ఎవరో కాదు వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి….
వైసీపీ నుండి పిడుగురాళ్లలో పోటీ చేస్తానని ఇటీవల వెల్లడించిన జంగాకి సిటింగ్ ని కాదని ఇవ్వటం సాధ్యం కాదని అధిష్టానం తేల్చి చెప్పడంతో టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేయసాగాడు. ఇదే సమయంలో వైస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ మినిస్టర్ అనిల్ కుమార్ లాంటి మాస్ లీడర్ ని పోటీలో పెడుతున్నట్టు వార్తలు రావడంతో ఉలిక్కిపడటం బాబు వంతు అయ్యింది.
నరసరావుపేట పార్లమెంట్ స్థానంలో టీడీపీ తరుపున అరవింద్ బాబు తప్ప మరో బీసీ అభ్యర్థి లేరు. అతన్ని తప్పించి రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చే ఉద్దేశంలో ఉన్న బాబు, అనిల్ కుమార్ అభ్యర్థిత్వం వార్త వినగానే బిసిల్లో బలమైన యాదవ సామాజిక వర్గం మొత్తం అనిల్ వైపు వెళుతుందని భావించి గురజాల నుంచి సీటు ఆశిస్తున్న జంగాని నరసరావుపేట నుండి పోటీ చేయమని వత్తిడి చేస్తున్నట్టు సమాచారం .
అయితే తాను నరసరావుపేట నుండి పోటీ చేసినా పార్లమెంట్ లోని అన్ని స్థానాలు ప్రభావితం చేయలేనని, అలాగే పేటలో యాదవులు ఆరు వేల లోపేనని, పేటలో బలమైన రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలని తన వైపు తిప్పుకోలేనని వివరించిన జంగా గురజాల నుండి అయితేనే టీడీపీలో జాయిన్ అవుతానని తేల్చి చెప్పారట.
మరోవైపు జంగా నరసరావుపేట వెళితే తన స్థానానికి డోకా లేకపోవడంతో పాటు జంగా వర్గం ఓట్లు కూడా తనకు పడతాయని భావించిన యరపతినేని నరసరావుపేటలో జంగా పోటీ చేస్తే ఆర్ధిక భారం తాను వహిస్తానని చంద్రబాబు దగ్గర ప్రపోజల్ పెట్టినట్టు సమాచారం .
2014 లో ఓడిపోయి 2019 లో తాను పోటీ చేయలేనని తప్పుకొన్న జంగా కృష్ణమూర్తిని విశ్వసనీయతే కొలమానంగా ఎమ్మెల్సీ చేయటంతో పాటు, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడిగా కూడా నియమించి అందలం ఎక్కించిన వైసీపీని వీడి టీడీపీ వైపు వెళ్లే ప్రయత్నంలో బాబు చదరంగంలో భాగంగా గెలవలేని నరసరావుపేటలో ఇరుక్కుని రాజకీయ ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడ్డాడని చెప్పొచ్చు .