మంగళగిరిలో గత ఎన్నికల్లో ఓడిపోయిన లోకేష్ ఈసారి ఎలాగైనా అదే స్థానంలో గెలవాలని పట్టుదలతో ఉన్నాడు. గెలుపుకోసం అడ్డదారులు తొక్కడానికి కూడా వెనుకాడటం లేదు. ఇందుకోసం మంగళగిరిలో టీడీపీ కూటమి మేనిఫెస్టోను ఇంటింటికి పంపడానికి లోకేష్ ప్లాన్ చేసాడు. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇంటింటికి తిరిగి మేనిఫెస్టో ఇవ్వడం కుదరదు కాబట్టి కొత్త ప్లాన్ వేసాడు.
ఆ ప్లాన్ లో భాగంగా చెన్నై నుంచి డైరెక్ట్ పోస్టుతో 1,80,000 మేనిఫెస్టో పత్రాలను మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు లోకేష్ పోస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. పైగా ఆ మేనిఫెస్టో పై బీజేపీ గుర్తును కూడా మాయం చేసి పోస్ట్ చేయడంతో అవన్నీ మంగళగిరి పోస్ట్ ఆఫీసుకు చేరుకున్నాయి. మొత్తం 23 బస్తాల్లో ఉన్న తెలుగుదేశం మేనిఫెస్టో కాపీలను గుర్తించిన పోస్టల్ శాఖ అధికారులు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో వాటిని పంపిణీ చేయకుండా నిలిపివేశారు. వీటి గురించి ఎన్నికల అధికారులకు సమాచారం ఇస్తామని పోస్టల్ శాఖ అధికారులు వెల్లడించారు.
కాగా ప్రచారం చేసి ప్రజలను ఆకట్టుకోవడం మాని ఇలా కుటిల యత్నాలకు లోకేష్ శ్రీకారం చుట్టడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడే ఇన్ని అడ్డదారులు తొక్కుతున్న లోకేష్ ముందు ముందు ఇంటింటికి ఇంకెన్ని తాయిలాలు ఎర వేస్తారో అని సామాన్య ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. లోకేష్ చేస్తున్న ఈ కుటిల ప్రయత్నాలకు ఈసీ అడ్డుకట్ట వేసి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు..