కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. అనేకమంది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జై కొడుతున్నారు. సోమవారం కేసరిపల్లి స్టే పాయింట్ వద్ద నందిగామ నియోజకవర్గానికి చెందిన నాయకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మూడు దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న చిరుమావిళ్ల శ్రీనివాసరావు అలియాస్ బుజ్జి చేరారు. ఈయన నందిగామ మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వడ్డెలి శ్రీనివాసరావు, కీలక నేత వై.రామారావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గోడపాటి బాబూరావు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, సీనియర్ నాయకులు డాక్టర్ షేక్ హసీనా, కొమ్ము విజయరాజులు చేరగా జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీ, వైఎస్సార్సీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్తి కేశినేని నాని, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
కేశినేని నాని వైఎస్సార్సీపీలో చేరాక కృష్ణా జిల్లాలో టీడీపీ పనైపోయింది. అనేకమంది తెలుగు తమ్ముళ్లు ఆ పార్టీని వీడారు. దీంతో చంద్రబాబు నాయుడు దిక్కుతోచని స్థితికి వెళ్లిపోయారు. ఇదే జిల్లాలో జగన్కు ప్రజలు బ్రహ్మరథం పడుతుండడంతో ఓర్వలేక అంతమొందించాలని చూశాడు. అయినా ఎవరూ వెనుకంజ వేయడం లేదు. తాము వైఎస్సార్సీపీలో చేరుతామని క్యూ కడుతున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. దీంతో చేరికలు ఇంకా ఉధృతంగా ఉండే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్పై దాడి చేయించి టీడీపీ తప్పు చేసిందనే భావన అందరిలో నెలకొంది.