ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం టికెట్ విషయంలో తెలుగుదేశంలో చిచ్చు రేగింది. మాజీ మంత్రి దేవినేని ఉమ తనకు సీటు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అయితే అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పంచాయితీ తెగేందుకు మరికొద్దిరోజుల సమయం పట్టేలా ఉంది. వసంత వైఎస్సార్సీపీ తరఫున గెలిచారు. అయితే ఈసారి ఆయనకు అధిష్టానం టికెట్ నిరాకరించింది. దీంతో టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీనిని ఉమ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రెండురోజుల క్రితం ఉమ పిలిపించుకుని బాబు మాట్లాడారు. సీటు ఇవ్వాల్సిందేనని చెప్పిన ఉమ.. బయటికి వచ్చి అధినేత ఏమి చెబితే అది చేస్తానని, నేను ఆయన కుటుంబసభ్యుడినని మీడియాకు వెల్లడించారు. కానీ వసంతను అడ్డుకునేందుకు నియోజకవర్గంలో తన అనుచరులను రెచ్చగొడుతున్నారు.
వసంత కృష్ణప్రసాద్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మైలవరం చండ్రగూడెం తెలుగుదేశం పార్టీ కార్యకర్త లక్కింశెట్టి పుల్లారావు గుండెపోటుతో మృతిచెందారు. ఉమకు టికెట్ రాదనే వార్తల వల్లే ఇలా జరిగిందని ఆయన మనుషులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీనికితోడు పుల్లారావు అంతిమయాత్రలో ఉమ పాల్గొనగా కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. ఆయన సమక్షంలోనే వసంతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేము అతడిని టీడీపీలోకి ఆహ్వానించడం లేదని, తీసుకోవద్దని అధినేతను డిమాండ్ చేశారు. కాదని వస్తే ఇక్కడ ఎలా తిరుగుతాడో చూస్తామని హెచ్చరించారు. తప్పుడు సర్వేలతో మనోధైర్యాన్ని దెబ్బతీసిన వ్యక్తి అని మండిపడ్డారు. ఆర్థికంగా, మానసికంగా కుంగదీసిన వసంత తమ భుజాలపై ఎక్కి స్వారీ చేస్తామంటే ఒప్పుకోమని ప్రకటించారు. ఉమ మాత్రం తనకు తెలియకుండా ఇదంతా జరిగిందని చూపించే ప్రయత్నం చేశారు. కానీ టికెట్ కోసం అందర్నీ రెచ్చగొట్టారని వసంత వర్గం ఆరోపిస్తోంది.
ఇదిలా ఉండగా తాను రెండురోజుల్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ఐతవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేవినేని ఉమతో వ్యక్తిగత ద్వేషాలు లేవన్నారు. అధిష్టానం సమక్షంలో ఆయనతో కలిసి మాట్లాడుతానని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ మెప్పు కోసం వసంత శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వారిని వ్యక్తిగతంగా దూషించాలని జగన్ చెప్పారట. టీడీపీ టికెట్ కోసం నీచానికి దిగజారి మాట్లాడటంపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి.