ఈనెల 13 న జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముద్రగడ మరో లేఖతో కలకలం సృష్టిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ వాసులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రస్తావిస్తూ జరగబోయే ఎన్నికలలో టిడిపి, జనసేన పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. టిడిపి జనసేన పార్టీలను శాశ్వతంగా సముద్ర గర్భం లో కలిసిపోయేలా తీర్పుని ఇవ్వాలని కోరారు. వైయస్ జగన్ గారి ఐదేళ్ల పాలనలో పేదవాడు కడుపునిండా అన్నం తినే పరిస్థితి ఉందని, పేద పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడే పరిస్థితిని, మెరుగైన వైద్యం లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చిన జగన్ గారిని ఓటు హక్కు ద్వారా మళ్ళీ గెలిపించుకుని గౌరవించాలని పిలుపునిచ్చారు.
ఆ లేఖలో ముద్రగడ ఇంకా ప్రస్తావిస్తూ… గతంలో ప్రతి ఇంట్లో గాజు గ్లాసులు వాడటం వల్ల అవి పగిలి హాని కలిగించేవని, అందువల్ల అందరూ స్టీల్ గ్లాసులు వాడుతున్నారన్నారు. ఎన్టీఆర్ హయంలో అందరూ సైకిలు తొక్కే వారని అయితే అవి ఇప్పుడు తుప్పు పట్టడంతో మోటార్ సైకిళ్లు, కార్లు వాడుతున్నారని ఎద్దేవాచేసారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఫ్యాన్లు ఉన్నాయని, అంచేత ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైయస్ జగన్ గారి పై ప్రేమ, ఆశీస్సులు కురిపించాలని కోరారు. సీఎం జగన్ గారికి ఓటు వేసే క్రమంలో తప్పు చేస్తే, శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉందని, ఆ తర్వాత రాక్షస పాలన రాజ్యమేలుతుందని తెలిపారు. వారి రాక్షస పాలన ఎంత పైశాచికంగా ఉంటుందో తెలియజేసే వీడియోలు సోషల్ మీడియాలో పెట్టానని, అందరూ చూడాలని హితవుపలికారు.
గతంలో ముద్రగడ ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర పని చేశానని, ఒక్క ఎన్. టి రామారావు గారు , డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు తప్ప పేదల ఆకలి గురించి పట్టించుకున్న నాయకుడు ఎవరూ లేరని, అలాంటి ఆలోచన కూడా ఎవరూ చేయలేదని గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అయితే అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల కోసం ఆలోచించిన నాయకుడు దేశం మొత్తం మీద జగన్ ఒక్కడేనని, జగన్ మాత్రమే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని తెలియజేశారు. అందుచేత రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా పిఠాపురం వాసులు ఓటు వేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి, టిడిపి జనసేన పార్టీలను శాశ్వతంగా సముద్ర గర్భంలో కలిసిపోయేలా తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పేదలు సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించే సీఎం జగన్ గారిని ఓటుతో గౌరవించుకోవాలని కోరుతున్నాను అన్నారు.