రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన శ్రేణులు.. అభిమానుల ఉత్సాహం నడుమ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిఎన్నికల రంగంలోకి దిగారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రను బుధవారం వైఎస్సార్ జిల్లా నుంచి ప్రారంభించారు. తాడేపల్లి నివాసం నుంచి ఇడుపులపాయకు చేరుకున్న జగన్.. తల్లి విజయమ్మతో కలిసి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం తల్లి నుంచి ఆశీస్సులు తీసుకుని వైఎస్సార్ ఘాట్ నుంచి రోడ్ షోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఘాట్ వద్దకు విచ్చేసిన అభిమానగణం జగన్తో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. వివిధ పథకాలకు చెందిన లబ్ధిదారులు ఉదయం నుంచే ఇడుపులపాయకు చేరుకుని తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ఎదురు చూశారు.
ఇక రెండో రోజు మేమంతా సిద్ధం యాత్ర ఇలా సాగుతుంది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో జరుగుతుంది. జగన్ ఆళ్లగడ్డ నైట్ హాల్ట్ నుంచి బయలుదేరి మార్గమధ్యలో శిరివెళ్ల మండలం ఎరగ్రుంట్లలో చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత నంద్యాల (వయా.. నూనెపల్లి, ఎస్పీజీ గ్రౌండ్స్)కు చేరుకుని బహిరంగ సభలో ప్రజలను ఉద్ధేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి పాణ్యం, కాల్వబుగ్గ, ఓర్వకల్లు, కర్నూలు క్రాస్, పెద్దటేకూరు మీదుగా కర్నూలు జిల్లా నాగలాపురం నైట్ హాల్ట్కు చేరుకుంటారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పార్టీ అధిష్టానం పటిష్టంగా చేసింది. పోలీసు ఉన్నతాధికారులు సీఎం రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.