ఏపీలో కూటమి మధ్య టికెట్ల పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడునాలుగో జాబితాలో భాగంగా అభ్యర్థులను ప్రకటించారు. టికెట్లు ఆశించిన కొందరి నేతలు లిస్ట్లో పేర్లు లేకపోవడంతో ఆశావహులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే అనంతపురం జిల్లా, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలోని టీడీపీ పార్టీ ఆఫీసులో టీడీపీ,చంద్రబాబు ఫ్లెక్సీలకు నిప్పంటించి తగలబెట్టారు
తాజాగా మరో టీడీపీ కీలక నేత అయిన కిమిడి నాగార్జున పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. చీపురుపల్లి టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయనగర జిల్లా టీడీపీ అధ్యక్ష పదవితో పాటు, చీపురుపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కిమిడి నాగార్జున తెలిపారు. విజయనగర జిల్లా అధ్యక్షుడుగా ఉన్న తనకు చీపురుపల్లి టికెట్ వస్తుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు.
కానీ చంద్రబాబు తాజాగా విడుదల చేసిన టీడీపీ అభ్యర్థుల జాబితాలో చీపురుపల్లి స్థానానికి కళా వెంకట్రావు పేరును ఖరారు చేశారు. తనకు కాకుండా కళా వెంకట్రావుకు టికెట్ కేటాయించడంతో మనస్థాపం చెందిన కిమిడి నాగార్జున టీడీపీకి రాజీనామా చేశారు. ఇహ నర్సాపురం స్థానం కోసం డిమాండ్ చేస్తుంటే చివరి లిస్టులో ఎమ్మెల్యేగా అయినా పోటీకి అవకాశం దక్కకపోతుందా అని ఎదురు చూసిన రఘురామరాజుకి ఆశాభంగం తప్పలేదు.