ఎన్నికల యుద్ధంలో ప్రత్యర్ధులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే.. అయితే అవి శృతిమించినప్పుడు మాత్రం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి సమాజంలో ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గం లో చోటుచేసుకుంది. రాజకీయపరమైన విమర్శలు తప్పితే ఏనాడూ వ్యక్తిగతమైన దూషణలు చేయని కన్నబాబుకి ఒకసారిగా కోపం కట్టలు తెంచుకుంది. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి పై నిప్పులు చెరిగే పరిస్థితి తీసుకు వచ్చింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం కాకినాడ పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తూ కన్నబాబుపై వ్యక్తిగత దూషణలు చేశారు. కన్నబాబు రాజకీయ జీవితం చిరంజీవి పెట్టిన బిక్ష అంటూ మాట్లాడసాగారు. అయితే గతంలో కూడా ఇలాంటి విమర్శలే పవన్ కళ్యాణ్ పదేపదే చేయటం ప్రజలకు విసుగు కలిగించే అంశమే తప్ప, దానివల్ల పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఉపయోగం ఉండదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం విధానపరమైనటువంటి అంశాల పై స్పందించకుండా, అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పకుండా కేవలం ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై ఇలాంటి వ్యక్తిగతమైన దూషణలు తప్పుడు ప్రచారాలు మాత్రమే పనిగా పెట్టుకున్నారు.
దీనితో ఆగ్రహానికి గురైన కన్నబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని తూర్పారబట్టారు. సమాజంలో మనం మాట్లాడే మాటలకు విలువ ఉండాలని, మనం వేసే అడుగులు, మన మాట తీరు ప్రజలకు ఆలోచన కలిగించేలా ఉండాలి తప్ప మనల్ని చూసి అపహాస్యం చేసేలా ఉండకూడదు అంటూ పవన్ ని ఎద్దేవా చేశారు. తాను చిరంజీవి వళ్ళనే రాజకీయాల్లోకి వచ్చానని దానిమీద తనకి ఎలాంటి సందేహము లేదు అని చిరంజీవి పై ఆ కృతజ్ఞత ఎప్పటికీ ఉంటుందని చెప్పారు. అలాగే వైయస్ జగన్ గారు తనను గుర్తించి జిల్లా అధ్యక్షుడిగా మంత్రిగా ఎమ్మెల్యేగా తనకు అవకాశాన్ని ఇచ్చి రాజకీయంగా ముందుకు నడిపించారని ఆయనపై నా కృతజ్ఞతా భావం ఎప్పటికీ చెరగనిదని తేల్చిచెప్పారు.అయితే చంద్రబాబు బీఫామ్ ఇవ్వకపోతే పోటీ చేసే పరిస్థితి లేని నీ రాజకీయ జీవితం, పిఠాపురంలో గెలుపు కోసం వర్మ కాళ్లపై పడిన నీ చేతకానితనం చంద్రబాబు, వర్మ పెట్టిన భిక్షా అంటూ సూటిగా ప్రశ్నించారు.