తనను తాను మేధావిగా ప్రకటించుకుని చంద్రబాబుకు అవసరం అయినప్పుడల్లా ఆయన వెనుకనే ఉంటూ సకల ప్రయోజనాలు అందించే వాలంటరీ రిటర్మెంట్ తీసుకున్న ఐఏఎస్ జయప్రకాష్ గారు ఇప్పుడు కష్టకాలం లో మరోసారి బాబు వెనకే నేను అని ప్రకటించుకున్నాడు. ప్రకటించుకోడమే కొత్తగానీ వెనుక ఉండటం ఏం కొత్త కాదు. టీడీపి పార్టీ ఆవిర్భావం నుండీ ఆయన టీడీపీ కి సానుభూతిపరుడే, ఎన్టీఆర్ కు అత్యంత దగ్గరగానే ఆయన పని చేసారు కూడా.. రిటర్మెంట్ తీసుకున్నాక 2009 లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించాక తమ వారు, టీడీపీ క్యాడర్ ఎక్కువ ఉండే కూకట్పల్లి నుండి ఎమ్మెల్యే కూడా అయ్యారు, తర్వాత 2014 లో మల్కాజ్గిరి నుండి ఎంపీ గా పోటీ చేయగా ఓటమి పాలయి మళ్లీ ప్రత్యక్ష రాజాకీయాల జోలికి వెళ్లకుండా అడపాదడపా టీవీ లలో, పర్సనాలిటీ డెవలమెంట్ క్లాసులలో కనిపిస్తుంటాడు..
2014 లో అనుభవం పేరుతో కొత్త రాష్ట్రానికి బాబు లాంటి సీనియర్ నాయకత్వం అవసరం అని సదరు జేపీ గారు మద్దతునిచ్చారు.. ఆయన అనుభవం రాష్ట్రాన్ని ఎలా దెబ్బేసిందో ప్రజలంతా గమనించి టీడీపీ ని చిత్తు చిత్తుగా ఓడించారు.. జేపీ గారికన్నా ప్రజలే ఎక్కువ అవగాహన ఉన్న వారు, ఎందుకంటే పాలన వలన ప్రత్యక్షంగా ప్రభావితం అయ్యేది ప్రజలే.. ఎవరి పాలన ఎలా ఉందని బేరీజు వేసుకునే అంత తెలివి ఓటర్లకే ఎక్కువ. ఈ విషయం జేపీ లాంటి మేధావులు అస్సలు ఒప్పుకోరు, ఎందుకంటే తమకంటే తెలివైన వారెవరూ లేరనేది వారి బలమైన నమ్మకం..
ఇక 2024 ఎన్నికల విషయానికి వచ్చేసరికి బిజెపి అడక్కుండానే, పోనీ టీడీపీ అడక్కుండానే, సరే కనీసం జనసేన వారు కూడా అడక్కుండానే మా మద్దతు కూటమికే అనేశారు.. (ఎవరడిగారు)… 2014-19 వరకు బాబు పాలనకు 3 మార్కులట,2019-24 మధ్య జగన్ పాలనకు 2 మార్కులేనట.
కోవిడ్ వల్ల రెండేళ్లు నష్టపోయినా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి జీఎస్డీపీ లో 21వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 14 వ స్థానానికి తెచ్చినందుకా రెండు మార్కులు? తలసరి ఆదాయంలో 19వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 5 ఏళ్లలో ఎవరికి సాధ్యం కానటువంటి వృద్ధితో 6 వ స్తానానికి తెచ్చినందుకా రెండు మార్కులు? పెట్టుబడులు వెనక్కి పోతున్నాయి జగన్ దెబ్బకి భయపడుతున్నారు అని యెల్లో మీడియా ప్రచారంలో పాలు పంచుకుని విష ప్రచారం చేసినా, 2 ఏళ్లు ఏ ఆర్ధిక కార్యకాలాపాలు జరగకుండా ప్రపంచం మొత్తం స్తంభించినా బాబు హయాంలో కంటే 3 రెట్లు అధికంగా పారిశ్రామిక పెట్టుబడులు తెచ్చినందుకా రెండు మార్కులు?
నాడు-నేడు అని, ఇంగ్లీష్ మీడియం అని సగటు పేద-మధ్యతరగతి పిల్లల విద్యపై 5 ఏళ్లలో 70 వేల కోట్లు ఖర్చు చేసి వారి విద్యా స్థాయిని మెరుగు పరిచినందుకా? కేంద్ర సాకారంతో ఏకంగా 17 మెడికల్ కాలేజీలు శరవేగంగా కడ్తున్నందుకా? దేశంలో ఎక్కడా జరగని రీతిలో ఒకేసారి 4 సీ పోర్టులు, 16 ఫిషింగ్ హార్బర్లు కడ్తున్నందుకా? ఎందుకు జేపీ గారూ బాబు కన్నా జగన్ కు ఒక మార్క్ తక్కువ? నాకు కులం అంటగడతారు అని అంటారు గానీ? ఆ ఒక్క మార్కు తగ్గింది కులం వల్ల కాదని ఎలా అనుకోవాలో జేపీ గారే వివరించాలి..
డబ్బులు పంచేసి రాష్ట్రాన్ని శ్రీలంక, వెనుజులా చేస్తున్నాడు అని పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాల మీద నిత్యం విషం కక్కే జేపీ గారు, టాక్స్ పేయర్ల డబ్బు అంతా పంచిస్తున్నాడు అనే ఆయన ఐఏఎస్ ఎలా అయ్యారో ఆశ్చర్యమే… ఈ దేశంలో టాక్స్ కట్టని వారు ఎవరు లేరు. ఒక బ్రెడ్డు ప్యాకెట్ కొంటె అందులో టాక్స్ ఉంటది, 5 రూపాయలకు దొరికే లేస్ ప్యాకెట్ మీద ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ టాక్సెస్ అని ఉంటుంది. ముష్టివాడు కూడా ప్రభుత్వానికి టాక్స్ కడుతున్నాడు ఇక కట్టనిది ఎవరు? ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో కేంద్రానికి అత్యధిక ఆదాయాన్నిచ్చే వనరు జీఎస్టీ అనే విషయం జేపీ గారికి తెలియకుండా ఉంటుందా.. పరోక్షంగా జీఎస్టీ కట్టని మనిషే లేడు
భారత్ లో. ఆర్ధిక వ్యవస్థ కుంటుపడుతుంటే దాన్ని ఉత్తేజితం చేయడానికి అత్యున్నత మార్గం సంపద పంపిణీ అని పెద్ద పెద్ద ఆర్ధిక వేత్తలు చెబ్తారు అంతెందుకు ఆర్బీఐ మాజీ గవర్నర్ ప్రఖ్యాత ఇండో అమెరికన్ ఎకనామిస్ట్ రఘురామ్ రాజన్ చెప్పింది కూడా అదే…
ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తే సోమరులు అవుతారని సదరు మేధావి గారు పదే పదే నొక్కి వక్కాణిస్తారు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ఇచ్చే పథకాల వలన ఇక చాలు మాకేం వద్దని ఏ పని చేయకుండా ఖాళీగా ఎంతమంది కూర్చుంటున్నారో మీరో కమిటీ వేసి నిర్ధారించవచ్చు కదా కమిటీ నిపుణులు వారు.. బాబు హయాంలో రెండు వేల ఎకరాలు స్వ సంక్షేమ పథకం ద్వారా పొందిన రామోజీ రావు గత 25 ఏళ్లుగా సోమరిగా ఇంట్లోనే కూర్చుని తింటూ తనకు నచ్చని వారిపై విషపు రాతలు రాస్తున్నాడు.. స్టూడియో ల కోసం ఎకరాలు ఎకరాలు పొందిన ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ-5 బిఆర్ నాయుడు లాంటి వాళ్లు సోమరులు అయ్యారు గానీ కాయా కష్టం చేసుకునే ఏ పేదవాడు సోమరి అవ్వలేదు. జగన్ ఇస్తున్న పథకాలను వాడుకుంటూ ఆర్థికంగా స్వావలంబన పొందుతూ వారి వారి పనులు చేసుకుంటూనే ఉన్నారు. మీలాంటి వారే సోమరులుగా ప్రజలను ఉద్ధరిస్తాం అంటూ ఖాళీగా తిరుగుతుంటారు..
ఇంతకీ బాబు హయాంలో ఎన్డీయే నుండి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత తమ తప్పులను బీజేపీ మీద నెట్టడానికి ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ పేరుతో అప్పట్లో పవన్ కల్యాణ్ కోరిక మేరకు ఆ కమిటీ కి అధ్యక్షత వహించిన జేపీ గారు రాష్ట్రం కేంద్రం ఇచ్చిన నిధులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, కేంద్రమే రాష్ట్రానికి దాదాపు 80 వేల కోట్ల బాకీ ఉందని తేల్చారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ కి ఆయన మద్దతు తెల్పుతున్నారు అంటే ఆ సొమ్ము కేంద్రం ఇచ్చేసినట్లేనా? ఒకవేళ ఇస్తే అది జగన్ ఘనతే అవుతుంది కదా. యధావిధిగా అదికూడా ఒప్పుకోరు…
తమరికి జాతి ప్రయోజనాలే కదా ముఖ్యం… ఇంతకీ మీ మద్దతు అనంతరం టీడీపీ కి ఎన్ని సీట్లు పెరగబోతున్నాయి మేధావి గారూ?