రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి అనడానికి తాజా ఉదాహరణ జంగా కృష్ణమూర్తి.. 1999 లో మొదటిసారి ఎమ్మెల్యే గా గురజాల నియోజకవర్గం నుండి గెలిపొందిన ఆయన, 2004 లో మరోసారి ఎన్నికయ్యారు. కాగా 2009 లో కాంగ్రెస్ నుండి, 2014 లో వైసీపీ నుండి వరసగా రెండుసార్లు ఓటమిపాలయ్యాడు.. 2014 లో ఓటమి చెందినా జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఎంఎల్సీ ఇచ్చి, వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడిగా నియమించి ఆయనకు తగిన గౌరవం ఇచ్చాడు..
కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఎవరి మెదడులో ఏ పురుగు తిరుగుతుందో ఎవరూ ఊహించనట్లుగా, రెండు సార్లు ఓడినా తనకు ఎంఎల్సి పదవి ఇచ్చి, పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడిగా కూడా గౌరవించిన పార్టీ లో తనకు గౌరవం లేదని ప్రకటించి వైసీపీని వీడి టీడీపీ లో జాయిన్ అవ్వాలని ప్రయత్నం చేసారు. దానిలో భాగం గా లావు తో కలిసి టీడీపీ బీసీ డిక్లరేషన్ సభలో జాయిన్ అవ్వాల్సి ఉండగా, తనకు టికెట్ కన్ఫర్మ్ చేస్తేనే జాయిన్ అవుతానని జాయినింగ్ ను వాయిదా వేసుకున్నారు. మొదట నుండి గురజాల నుండి పోటీ చేయాలని భావించిన ఆయన టీడీపీ తరపున టికెట్ ఆశించాడు, లావు రికమండేషన్ తో యరపతినేనిని నర్సారావు పేట కు పంపి, తనకు గురజాల కేటాయించాలని ప్రయత్నాలు చేయగా యరపతినేని ససేమిరా అన్నాడు. యరపతినేని కి బాబుకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా గురజాల టికెట్ యరపతినేనికే వరించింది. ఇక మొత్తం పల్నాడు జిల్లాలోనే టీడీపీ నుండి కనీసం ఒక్క బీసీ క్యాండిడేట్ లేక, మరో పక్క నరసరావుపేట ఎంపీ టికెట్ ను వైసీపీ అనిల్ కుమార్ యాదవ్ కు కేటాయించగా తప్పక లావు నర్సరావుపేట నుండి అయినా జంగా ను రంగంలో దింపాలనే ప్రయత్నంలో భాగంగా ఆయనను సంప్రదించగా జంగా దానికి విముఖత వ్యక్తం చేశాడు. నరసరావు పేట ఎమ్మెల్యే టికెట్ కూడా లావు సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించాలని లావు ముమ్మర ప్రయత్నాలు చేయగా అరవింద బాబు కన్నీరు పెట్టుకోవడం, అతని అనుచరులు ఆత్మహత్యయత్నం చేయడం తదితర అంశాలు దృష్టిలో ఉంచుకుని అరవింద బాబుకే టికెట్ కన్ఫర్మ్ చేశారు…
మొత్తానికి గురజాల స్థానం నుండి టికెట్ దక్కక, నర్సారావుపేట నుండి పోటీ చేయలేక, అటు టీడీపీ లో జాయిన్ అవ్వక, ఇటు వైసీపీ లో ఉండలేక, తన రాజకీయ భవిష్యత్తును తానే అంధకారంలోకి నెట్టుకుని ఉన్న ఎంఎల్సీ పదవి కూడా ఎప్పుడు ఊడుతుందో తెలియని స్థితిలో జంగా త్రిశంకు స్వర్గంలో మిగిలిపోయారు.