గౌరవ మర్యాదలా.. పదవి ప్లస్ డబ్బా.. వీటిలో ఏది ఎంచుకోవాలో అర్థంగాక కొద్దిరోజులుగా మీమాంసలో ఉన్న జంగా కృష్ణమూర్తి రెండో దానికే ఓటు వేశారు. నరసాపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులుతో కలిసి ఆదివారం చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
జంగా వైఎస్సార్సీపీలో గురజాల సీటు ఆశించారు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి కాసు మహేష్రెడ్డికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. మరో రూపంలో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఈ సమయంలో ఆయన్ను లావు తన వెంట టీడీపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. గురజాల టికెట్ కృష్ణమూర్తికి ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖత చూపలేదు. దానిని యరపతినేని శ్రీనివాసరావుకే ఇస్తానన్నారు. నరసారావుపేట అసెంబ్లీ అయితే ఓకే అన్నారు. కానీ జంగాకు అక్కడ పోటీ చేయడం ఇష్టం లేదు. దీంతో లావు తెలుగుదేశంలో చేరినా తాను వెళ్లకుండా ఉండిపోయారు.
కొద్దిరోజుల క్రితం జంగా తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ గూటికి చేరాలని తీవ్రంగా ప్రయత్నించారు. అక్కడైతే తనను బాగా చూసుకుంటారని, గౌరవం ఉంటుందని భావించారు. ఎందుకంటే బీసీ అయిన ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి జగన్ అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చాక బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని చేసి ప్రాధాన్యం కల్పించారు. దీంతో జగన్ చేరదీస్తారని నమ్మకం పెట్టుకున్నారు. నరసారావుపేట ఎంపీగా చెందిన అనిల్కుమార్ యాదవ్ పోటీలో ఉండడంతో బీసీల ఓట్ల కోసం లావు.. చంద్రబాబుతో మాట్లాడి జంగాకు అనేక ఆఫర్లు ఇచ్చారు. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే తిరుమల, తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇస్తామని చెప్పారు. పవర్లోకి రాకపోతే ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీని చేస్తామన్నారు. ఇంకా రూ.10 కోట్ల వరకు డబ్బు ఇస్తామని చెప్పడంతో కృష్ణమూర్తి వాటికి ఆశపడ్డారని ప్రచారం జరుగుతోంది. గౌరవ మర్యాదలు ఎవరికి కావాలి.. డబ్బు, పదవులే ముఖ్యమని టీడీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. త్వరలో గురజాలలో జరిగే బాబు సభలో చేరుతారని తెలిసింది.