జనసేన పార్టీ ఉనికిని దెబ్బ తీసింది తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు చెన్నారెడ్డి మనుక్రాంత్రెడ్డి అన్నారు. ఈయన జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. శనివారం నెల్లూరులో విలేకరుల సమావేశంలో అనేక కీలక విషయాలు వెల్లడించారు.
జనసేనను జిల్లాలో పటిష్టపరిచేందుకు గడిచిన ఆరేళ్లుగా నేను ఎంతో కృషి చేశా. 2018లో నేను జనసేనలోకి అడుగు పెట్టినప్పుడు జిల్లాలో ఎక్కడా పార్టీ లేదు. అప్పట్లో మీటింగులు టీ దుకాణాలు, పార్కుల్లోనే జరిగేవి. నేను జిల్లా పార్టీ ఆఫీసు పెట్టి నెలకు రూ.లక్షల్లో ఖర్చు చేశాను. అనేక పార్టీ కార్యక్రమాలకూ నేను డొనేషన్లు ఇచ్చిన సందర్భాలున్నాయి. ఇవి తెలియని కొందరు కనీస ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడటం సిగ్గుచేటు. జనసేన మనుగడ లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబే. కేవలం 21 సీట్లు విదిల్చి.. ఎవరు పోటీ చేయాలనేది కూడా టీడీపీ కార్యాలయమే నిర్దేశిస్తే.. ఇక ఆ పార్టీ ఎందుకు?, దానికి అధినేత ఎందుకు? నాలాంటి యువకులం జనసేనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. యువతరానికి రాజకీయ అవకాశం లభించిందంటూ పార్టీలో సంవత్సరాల తరబడి పనిచేశాం. అయితే, చంద్రబాబు దుష్టాలోచనకు మా ఆశలన్నీ ఆవిరయ్యాయి.
ఒక పార్టీ నుంచి ద్వితీయశ్రేణి నాయకుడు బయటకు వెళ్తేనే చాలా పరువు తక్కువ పనిగా భావిస్తాం. అలాంటిది, జిల్లా పార్టీ అధ్యక్షుడే వీడిపోయాడంటే.. ఆ పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్ధం చేసుకోవాలి. పరువు, మర్యాద, భవిష్యత్ లేని చోట ఉండకూడదని నిర్ణయం తీసుకునే వైఎస్సార్సీపీలో చేరాను. ఇప్పటికే చాలామంది మంచి నిర్ణయం తీసుకున్నానంటూ అభినందిస్తున్నారు. నాతో ప్రయాణం చేస్తామంటున్నారు. గతంలో నాతో పనిచేసిన వారందరికీ అండగా ఉంటా. వారిని వైఎస్సార్సీపీలోకి ఆహ్వానిస్తున్నా.
ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడే మరో పార్టీలోకి చేరాడంటే అది ఎన్నికల్లో చాలా ప్రభావం చూపుతోంది. జనసేనలో ఉన్నప్పుడు కూడా నేను ఏరోజూ ఇతర పార్టీలోని వ్యక్తులపై వ్యక్తిగతంగా మాట్లాడలేదు. రాజకీయ విధానాలపైనే పోరాడి విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ప్రజల్లో ఒక క్రెడిబులిటీ ఉన్న నాలాంటి నేతలే జనసేన పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారంటే ప్రజలంతా ఆలోచించాలి. జిల్లాలో ఒక్క సీటు కూడా లేకపోతే.. ఆ పార్టీ మనుగడ ఎంత కష్టమో అందరూ అర్థం చేసుకోవాలి. ఆరేళ్లు కష్టపడి పార్టీని నడిపింది ఎందుకు?, సీట్లు రాకపోవడంపై ఇన్నాళ్లూ నాతోపాటు ప్రయాణించిన వారందరికీ ఏం సమాధానం చెప్పాలి? అందుకే విలువల్లేని చోట ఉండకూడదని నిర్ణయించుకున్నా. ప్రజల భవిష్యత్ కోసం వైఎస్సార్సీపీలో చేరా.
2019 ఎన్నికల్లో టీడీపీని ఉద్దేశించి జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఏమన్నాడు? మనం టీడీపీ కుంభస్థలాన్నే కొట్టాలన్నాడు. అదే పంథాలో నేను అప్పట్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినప్పుడు చంద్రబాబు వర్గీయుల అవినీతిని ఎండగట్టాను. నీరు – చెట్టు పనుల్లో దోపిడీని, జన్మభూమి కమిటీల దందాపై నెల్లూరు జిల్లాలో ఊరూరా ప్రచారం చేశాను. ఎక్కడా టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కకూడదని పోరాడాం. 2014లో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో హామీల్లో కనీసం 10 శాతం కూడా వాళ్లు పూర్తిచేయలేదు. మాయమాటలతో ప్రజలను బురిడి కొట్టించే చంద్రబాబు ఒక పచ్చి అవకాశవాది. ఆయన్ను నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే నైజం ఆయనది. జిల్లా ప్రజలు బాబు రాజకీయ శైలిని బాగా అర్థం చేసుకున్నారు. బాబు వస్తే యువతకు జాబు అన్నాడు. అయితే లోకేశ్బాబుకు మాత్రం జాబ్ ఇచ్చుకున్నాడు.
2014 నుంచి 2019 వరకు ప్రతి టీడీపీ నాయకుడు జనసేన పార్టీ నేతల్ని, కార్యకర్తలను ఇష్టమొచ్చినట్లు ఎగతాళిగా మాట్లాడి తీవ్రంగా అవమానించిన సందర్భాలున్నాయి. అలాంటిది, మళ్లీ ఇప్పుడు జనసేన కేడర్ వెళ్లి అదే టీడీపీ నేతల కోసం పనిచేయాలా? ఎంతోమంది నా దగ్గరకొచ్చి ఆవేదన వ్యక్తం చేసి చంద్రబాబు కోసం మళ్లీ పనిచేయడానికి మేము సిద్ధంగా లేమని చెప్పారు. జిల్లా ఎప్పుడూ వైఎస్సార్సీపీకి కంచుకోటే. పవన్కళ్యాణ్తో సహా జనసేన అధినాయకత్వమంతా చంద్రబాబు ట్రాప్లో పడింది. అందువల్ల మనలాంటి యువతకు రాజకీయ అవకాశాలు ఉండవు. బాబు మనల్ని ఎదగనీయడు. అందువల్ల పవన్కళ్యాణ్ను అభిమానించే వారంతా చంద్రబాబుకు ఖచ్చితంగా బుద్ధిచెప్పాలి.
జిల్లాలో ఎక్కడ చూసినా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. ప్రభుత్వ పథకాల విధానాలపై ప్రతి చోటా పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. గడిచిన రెండు నెలలుగా చూస్తే రాష్ట్రం మొత్తం పొలిటికల్ వేవ్ చాలా మారింది. అమ్మఒడి, ఆసరా, చేయూత, జగనన్న విద్యాదీవెన, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వంటి ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో చాలా సంతృప్తి కనిపిస్తోంది. కాబట్టే జనం స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైఎస్సార్సీపీ జెండా పట్టుకుంటున్నారు. జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎం అవుతారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి, రూరల్ అసెంబ్లీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.