జనసేన టీడీపీ కూటమి 99 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. కానీ పొత్తులో కేవలం 24 సీట్లకే జనసేన పరిమితం కావడం అలా 24 సీట్లలో పోటీకి పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం చూసి జనసైనికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమ అభిమానాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తాకట్టు పెట్టారనే యోచన జనసైనికుల్లో ఇప్పటికే మొదలైంది. టీడీపీతో పొత్తులో భాగంగా గౌరవప్రదంగా సీట్లను జనసేన పార్టీకి కేటాయించనున్నారని అందరూ భావిస్తూ వచ్చారు. కానీ అతి తక్కువ సీట్లను జనసేనకు చంద్రబాబు కేటాయించడం దానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడంతో జనసేన కార్యకర్తలు తమ పార్టీకి విలువలేదని బహిరంగంగా వాపోతున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు జనసేన కార్యకర్తలకు మరింత ఆవేదనకు కారణమైంది. 2019 ఎన్నికల్లో జనసేనకు ఎక్కువ మంది ఓటు వేయని కారణంగా తక్కువ సీట్లలో పోటీకి ఒప్పుకున్నామని, అందుకే కేవలం 24 సీట్లకు పరిమితం కానున్నామని ఒకవేళ ఎక్కువ సీట్లు గెలిపించి ఉంటే ఇప్పుడు పొత్తులో ఎక్కువ సీట్లను అడిగేవాడినంటూ నిందను కార్యకర్తలపై మోపే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారు. తక్కువ సీట్లకు పరిమితం కావడమే కాకుండా నిందను కూడా కార్యకర్తలపై వేయడాన్ని జన సైనికులు జీర్ణించుకోలేక పోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ నిరసన గళాన్ని జనసైనికులు వినిపిస్తున్నా పవన్ కళ్యాణ్ ఆ నిరసనలను పరిగణలోకి తీసుకోవడం లేదు.
వాస్తవానికి 2019 ఎన్నికల్లో టీడీపీకి 39% ఓట్లు పోలవగా జనసేనకు 5% ఓట్లు పోలయ్యాయి. ఫలితంగా 175 స్థానాలకు గానూ టీడీపీ 23 జనసేన కేవలం ఒక్క స్థానం మాత్రమే గెలుచుకోగలిగింది. అనంతరం రాజకీయ పరిణామాల్లో కీలక మార్పుల వల్ల టీడీపీ పతనావస్థకు చేరుకుంది. రాజకీయంగా ఎదగాలి అనుకున్న ఏ పార్టీ అయినా భవిష్యత్ ప్రణాళికల కోసం టీడీపీ స్థానాన్ని ఆక్రమించి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని అనుకుంటుంది. కానీ టీడీపీ ‘బి’ పార్టీగా మారిపోయిన జనసేన టీడీపీ శ్రేయస్సు కోసం పాటుపడుతూ మళ్ళీ టీడీపీకి జవసత్వాలు ఇచ్చే పనిలో బిజీగా ఉంది. కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన అభిమానులను చంద్రబాబుకు పాదాక్రాంతం చేయడానికి కూడా వెనుకాడటం లేదు.
టీడీపీతో పొత్తు కోసం బీజేపీని కూడా ఒప్పించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడ్డారు. టీడీపీ శ్రేయస్సు కోసం ఎందుకింత తాపత్రయ పడుతున్నారో జనసైనికులకు అర్థం కావడం లేదు. వేరే పార్టీకోసం పెడుతున్న శ్రమ తన సొంత పార్టీకోసం పెట్టి ఉంటే ఇప్పటికే జనసేన పార్టీ మరోస్థాయిలో ఉండేదన్నది జనసైనికుల వాదన. ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగడానికి ప్రయత్నం చేయకపోవడం, కేవలం చంద్రబాబు మేలు కోసమే రాజకీయాలు చేయడం, తాను గెలవాలని రాజకీయం చేయకుండా జగన్ ఓడిపోవాలని రాజకీయాలు చేయడం ఇవన్నీ జనసేన కార్యకర్తలు గమనిస్తూ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మూడొంతుల సీట్లలో పోటీ చేస్తున్నామని ప్రకటించి 24 సీట్లకే పరిమితం కావడం పట్ల జనసైనికుల ఆవేదనకు అంతే లేకుండా పోయింది.
2019లో ప్రజలు తిరస్కరించిన పార్టీతో ఎదిగే అవకాశం ఉన్న జనసేన పొత్తు పెట్టుకుని అసలు రాష్ట్రంలో రెండు శాతం ఓటింగ్ కూడా లేని బీజేపీ పొత్తుకు వెంపర్లాడటం చూసి పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలు అర్ధంకాక జనసైనికులు తెల్లమొఖం వేస్తున్నారు. తమ పార్టీ కోసం కాకుండా టీడీపీ మేలు కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ కు బుద్ది చెప్పాలని జనసేన కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు.