తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కువ సంఖ్యలో టికెట్స్ ఇవ్వలేదు. కావాల్సిన చోట అవకాశం కల్పించలేదు. కూటమిలో పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ జన సైనికుల ఎలివేషన్లు ఒక రేంజ్లో ఉంటున్నాయి. సేనాని పవన్ కళ్యాణ్ వారిని అలా తయారు చేశాడు. తనపై అసంతృప్తిగా ఉన్నారని తెలిసిన వెంటనే ఏదో ఒక కట్టు కథ చెప్పేస్తాడు.
పొత్తులో భాగంగా 21 సీట్లు తీసుకోగా వాటిలో ఎక్కువగా తెలుగుదేశం మనుషులకే పవన్ అవకాశం ఇస్తున్నాడు. దీనిపై మెజార్టీ జన సైనికులు ఆవేదన చెందుతుండగా.. మరికొందరు మాత్రం పవన్ వ్యూహమంటూ ఎలివేషన్లు ఇస్తూ నవ్వుల పాలవుతున్నారు.
తెలుగుదేశానికి చెందిన మండలి బుద్ధ ప్రసాద్ ను జనసేనలో చేర్చుకొని అవనిగడ్డ టికెట్ ప్రకటించారు సేనాని. దీనికే చాలా మంది అభిమానులు మురిసిపోతున్నారు. వాస్తవానికి బుద్ధ ప్రసాద్ కు ప్రజా బలం లేదు. ఆ నియోజకవర్గంలో జనసేన ప్రభావం అంతంతమాత్రమే. 2019లో ముత్తంశెట్టి కృష్ణారావు సేన తరఫున పోటీ చేశారు. ఆయనకు కేవలం 28,556 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఐదు సంవత్సరాల్లో ఆ పార్టీకి పెరిగిన గ్రాఫ్ శూన్యం. అసలు పార్టీని బలోపేతం చేసే దిశగా ఎటువంటి చర్యలు అధిష్టానం తీసుకోలేదు. అయినా వలస పక్షిని తెచ్చుకుని జనసైనికులు సోషల్ మీడియాలో ఎలివేషన్లు ఇవ్వడాన్ని చూసి తెలుగు తమ్ముళ్లు అవాక్కవుతున్నారు.