Chandrababu : ఐటి పితామహుడిగా తనను తాను ప్రమోట్ చేసుకునే చంద్రబాబుకు జాకీలు పెట్టే రామోజీ ఆంధ్రలో ఐటీకి పొగబెట్టారంటూ విషపు కథనాన్ని వండి వార్చాడు. నిజానికి రాష్ట్రం విడిపోయాక ఐటీకి మంగళం పాడింది చంద్రబాబే. ఒకవేళ చంద్రబాబు విశాఖలో రాజధాని పెట్టి ఉంటే హైదరాబాద్ అంత కాకపోయినా ఇప్పటికి అందులో సగం అయినా విశాఖపట్నం అభివృద్ధి అయ్యేది. కానీ చంద్రబాబు తన లబ్ది కోసం అమరావతి పేరిట కొత్త డ్రామాకి తెరలేపాడు.
ఒక్కసారి చంద్రబాబు పాలనలో ఐటి ఎగుమతులను పరిశీలిస్తే 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఐటి ఎగుమతుల విలువ 969 కోట్లు కాగా బాబు దిగిపోయే నాటికి 2018-19 ఆర్థిక సంవత్సరంలో 986 కోట్లకు చేరింది. అనంతరం కోవిడ్ మహమ్మారి వల్ల రెండేళ్లపాటు ఐటి రంగం స్తంభించింది. జగన్ పాలనలో 202-23 ఆర్థికసంవత్సరంలో ఐటి ఎగుమతుల వృద్ధి 1,867 కోట్లకు చేరడం గమనార్హం. ఇక్కడ క్లియర్ గా జగన్ పాలనలో రెట్టింపు స్థాయిలో ఐటి ఎగుమతులు జరుగుతున్నాయనడం వాస్తవం. కానీ ఈనాడుకు ఇవేమి పట్టవు.
జగన్ పాలనలో విశాఖకు వెల్లువలా పెట్టుబడులు
ఉమ్మడి రాష్ట్రంలో ఐటి ఎగుమతుల్లో చంద్రబాబు సీఎం కాకముందు ఏపీ స్థానం మూడు కాగా 2004లో చంద్రబాబు దిగిపోయేనాటికి ఆంధప్రదేశ్ స్థానం ఐదుకు దిగజారడం బాబు పాలనలో ఐటి రంగం కుదేలైందనడానికి ఉదాహరణగా చెప్పొచ్చు. రాష్ట్ర విభజన తరువాత 2014-19 మధ్య బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ సంస్థలు ఏపీకి రాలేదు కానీ జగన్ పాలనలో ఇప్పుడు ఇన్ఫోసిస్ వచ్చింది . బీచ్ ఐటీ కాన్సెప్ట్తో ఆకర్షితులై ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్, యాక్సెంచర్, రాండ్స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్, అమెజాన్ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలన్నీ విశాఖవైపు అడుగులు వేశాయి. వైఎస్సార్ హయాంలో పురుడుపోసుకున్న విప్రో సంస్థ ఎట్టకేలకు కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
విశాఖలో స్టార్టప్ల ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) సీఈవో సంజీవ్ మల్హోత్రా ప్రకటించారు. ఐటీ పరిశోధనలు, అభివృద్ధిలో భాగంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎకో సిస్టమ్ని ఏర్పాటు చేయనున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ చెగ్, విశాఖలో కొత్త బ్రాంచ్ని ప్రారంభించింది. భారత్లో ఢిల్లీ తర్వాత వైజాగ్లోనే చెగ్ సంస్థ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం విశేషం. అదానీ డేటా సెంటర్ ఏర్పాటయింది. మిగిలిన ప్రధాన ఐటీ కంపెనీలు కూడా విశాఖలో ఏర్పాటయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇంత అభివృద్ధి కళ్ళకు కనబడుతున్నా కేవలం ఓ పార్టీకి లబ్ది చేకూర్చాలన్న రాజకీయ దుగ్ధతోనే ఈనాడు ప్రభుత్వంపై బురదజల్లుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.