మూడో జాబితాలో సీటు దక్కుతుందని ఎదురుచూసిన టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు నిరాశే ఎదురైంది. మూడో జాబితాలో కూడా చోటు దక్కకపోవడంతో దేవినేని ఉమకు టీడీపీ తరపున ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనట్లే అని స్పష్టమైంది. దీంతో ఆయన నిరాశలో కురుకుపోయినట్లు సమాచారం.
టీడీపీలో వరుసగా నాలుగు సార్లు గెలిచిన సీనియర్ నేత దేవినేని ఉమా. 1999,2004,2009,2014 సంవత్సరాలలో నందిగామ, మైలవరం నియోజకవర్గాల నుండి పోటీ చేసి విజయం సాధించారు. 2004,2009 సంవత్సరాలలో టీడీపీ ఓడిపోవడంతో కృష్ణా జిల్లాలో బలహీనపడిన టీడీపీని బలోపేతం చేయడానికి దేవినేని ఉమా కృషి చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో జలవనరుల శాఖా మంత్రిగా పనిచేసారు. కానీ ఒకే ఒక్క ఓటమి ఆయన రాజకీయ జీవితాన్ని కకావికలం చేసింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో దేవినేని ఉమకు సమస్యలు మొదలయ్యాయి.
ఓటమి అనంతరం మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ వచ్చారు. కాగా వసంత కృష్ణ ప్రసాద్ టికెట్ హామీతో టీడీపీలో చేరారు. కానీ ఆయన టీడీపీలో చేరడాన్ని దేవినేని ఉమా తీవ్రంగా వ్యతిరేకించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం మైలవరంలో వసంత కృష్ణప్రసాద్కు టికెట్ ఇచ్చి దేవినేని ఉమాను పెనమలూరు నుంచి పోటీ చేయించాలని భావించారు. పెనమలూరులో తనకు సీటు దక్కదేమో అన్న అనుమానంతో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నిరసనలు వ్యక్తం చేస్తూ వార్తల్లో నిలిచారు. దాంతో పాటు దేవినేని ఉమా, ఎంఎస్ బేగ్, వసంత వసంత కృష్ణప్రసాద్, ఆలపాటి రాజా, దేవినేని చందు పేర్లతో పెనమలూరులో ఐవీఆర్ఎస్ సర్వేలను టీడీపీ నిర్వహించింది. దీంతో దేవినేని ఉమకు పెనమలూరులో సీటు ఇస్తారని ప్రచారం జరిగింది.
తీరా చంద్రబాబు ప్రకటించిన మూడో జాబితాలో మైలవరం సీటును వసంత కృష్ణప్రసాద్కు కేటాయించి పెనమలూరులో బోడే ప్రసాద్ కు సీటు ఇచ్చారు. దేవినేని ఉమా దగ్గర ఎన్నికల్లో ఖర్చు చేసేంత డబ్బు లేదని అందుకే ఆయనను పక్కనపెట్టారనే ప్రచారం జరుగుతుంది. టీడీపీలో అత్యంత సీనియర్ నేతగా ఉన్న దేవినేని ఉమకు కూడా సీటు ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు గుర్రుగా ఉన్నారు. అదీకాక మొదటినుండి మైలవరంలో అవినీతికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై తీవ్రమైన అభియోగాలు మోపుతూ వచ్చిన టీడీపీ అతన్ని పార్టీలో తీసుకుని ఆయనకు టికెట్ కేటాయించి దేవినేని ఉమా లాంటి సీనియర్ నేతను పక్కనపెట్టడం టీడీపీ అభిమానులకు మింగుడుపడటం లేదు. కాగా సీటు దక్కకపోవడంపై దేవినేని ఉమ స్పందించలేదు. మరి దేవినేని ఉమా రాజకీయ కెరీర్ కు ఇక్కడితో ఫుల్ స్టాప్ పడనుందా లేక టీడీపీ ఆయనకు ఏదైనా రాజకీయ బాధ్యత అప్పజెపుతుందా అనేది కొన్ని రోజుల్లో తేలనుంది.