“ఫీజులు పెంచు ఖజానా నింపు” అనే పేరుతో ఈనాడు ఒక ఆర్టికల్ రాసింది. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేసి ఆంధ్ర ఖజానా నింపేస్తున్నారని ఆ వార్త సారాంశం. కానీ ఇదే ఈనాడు ఇటువంటి పద్దతిని తెలంగాణలో అవలంబించినపుడు కూడా ఆ వార్త రాసింది. రెండు రాష్ట్రాల గురించి ఒకేలా రాస్తే అది ఈనాడు ఎందుకవుతుంది ??
ఇపుడు ఆ వార్తల్లోని విద్వేషాన్ని విడమరిచి చూద్దాం. తెలంగాణలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచినపుడు, ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిందనీ.. పైగా సులభతరం చేయడం వల్ల “తరిగిపోయిన స్థిరాస్తి కల” అంటూ వార్త వేసింది. అంతేకాక, తెలంగాణలో భారీగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనీ, ఆంధ్రలో జరగట్లేదనీ వాపోయింది. 2021 – 22 కి తెలంగాణలో 12,429 కోట్ల ఆదాయం రాగా.. ఆంధ్రాలో 7344 కోట్ల ఆదాయం వచ్చింది. దానిని పోల్చుతూ.. తెలంగాణలో పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీల వివరాలు చెప్పకుండా వండి వార్చిన చప్పిడి వార్త అది.
ఇపుడు ఆంధ్రాలో కూడా ఛార్జీలు పెరిగి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అనేసరికి అది కూడా తప్పులా పెరిగిన రేటు గురించి మాట్లాడుతుంది. కానీ సులభతరం అయినా రిజిస్ట్రేషన్ల విధానాన్ని మాత్రం ముచ్చటించట్లేదు. కొత్త జిల్లాల ఏర్పాటు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వినూత్న మార్పులు, ఛార్జీలను ప్రయోగాత్మకంగా కేవలం 19% గ్రామాల్లోనే పెంచిన ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం పోయి విద్వేషం చిమ్ముతూ వార్తలు రాసి ప్రజలను మభ్యపెడుతుంది. ఇదే పని చంద్రబాబు చేసి ఉంటే సింగపూర్ తరహా రిజిస్ట్రేషన్లు, వెల్లువలా రిజిష్టార్ ఆఫీసు చుట్టూ జనం, చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్లో మరో మైలురాయి అంటూ ఊదరగొట్టి ఉండేది.