సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొనసాగిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా బస్సు యాత్రలో ఇతర పార్టీలలోని పలువురు నేతలు అధికార వైసీపీలో చేరుతున్నారు. తాజాగా బస్సుయాత్రలో ఎద్దల చెరువు వద్ద తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్టువర్ధన్ రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అనుచరులుతో ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలు, కార్యక్తలనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే..
ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. అందరినీ కలిసే పరిస్ధితి కష్టం అనేది దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఎన్నికల ప్రచారం మధ్యలో ఉన్నాం కాబట్టి, వెళ్లాల్సిన రూటు ఇంకా చాలా ఉంది. ప్రతి ఒక్కరినీ కలవలేకపోయానని బాధపడవద్దు అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు, పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుయజేస్తున్నాను. 6వ తేదీన కావలిలో “కావలి సిద్ధం” సభ కూడా మీ దగ్గరే జరుగుతుంది. మీ అందరినీ అప్పుడు వీలైనంతవరకు ఆ రోజు కలిపించమని విష్టుకు చెబుతున్నాను. ఎంతమందిని వీలైతే అంతమందిని కలిపిస్తాడు. ధన్యవాదాలని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
కాగా సీఎం జగన్ నిర్వహిస్తున్న బస్సుయాత్ర అప్రతిహతంగా కొనసాగుతుంది. ప్రజలతో మమేకం అవుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. కాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమితో హోరాహోరీగా తలపడనుంది. సీఎం జగన్ తన సంక్షేమ పథకాలే తన పార్టీని గెలిపిస్తాయని నమ్ముతూ ఎన్నికల బరిలో ఒంటరిగా పోటీకి దిగుతుండగా మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశ్యంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమను గెలిపిస్తుందని కూటమి బలంగా విశ్వసిస్తుంది.