ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగడానికి ఇంకా ఎంతో సమయం లేదు. ఈ సమయంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల నుంచి పలువురు కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు ముఖ్యమంత్రి జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో పలాస నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె శిరీష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే పార్వతీపురం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాతపట్నం నియోజకవర్గం నుంచి హిరమండలం మాజీ జడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇలా టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల నుంచి పలువురు కీలక నేతలు వైసీపీలో చేరడంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీకి మరింత బలం చేకూరినట్లైంది. కాగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలతో మమేకం అవుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రతి పక్షాలను ఎండగడుతున్నారు. మేమంతా సిద్ధం చివరి సభలో ఈ నెల 26 న వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు సమాచారం. నవరత్నాలను మించి ఈ మేనిఫెస్టో ఉండబోతుందని వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.