ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసలు జల్లు కురిసింది. బుధవారం తిరుపతిలో జరిగిన ఇండియూ టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యారంగంలో వచ్చిన నూతన విధానం, మనబడి నాడు – నేడు, విద్యా కానుక, గోరుముద్ద, టోఫెల్ శిక్షణ, ట్యాబ్ల పంపిణీ, మొదలైన అంశాలపై చర్చ జరిగింది. సమ్మిట్ ప్రతినిధులు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను చెప్పి జగన్ను ప్రశంసించారు. సీఎంతో సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ పలు విద్యా సంబంధిత విషయాలు చర్చించారు.
జగన్ను స్టేజీపైకి పిలిచే సమయంలో విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషిని ప్రతినిధులు ఎంతో సంతోషంగా వెల్లడించారు. తిరుపతిలో మీరు రూపురేఖలు మార్చిన బడులను చూశామని చాలా గొప్పగా అనిపించినట్లు తెలిపారు. సీఎం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఊరిలో బాగా అమలవుతున్నాయన్నారు. మేం పాఠశాలలు చూసినప్పుడు ఇక్కడ చదువుకోవాలని అనిపించిందన్నారు. మీరు తీసుకున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు.
ప్రభుత్వ స్కూళ్ల పిల్లలు గ్లోబల్ అవకాశాలు అందుకునేలా చేయడం మంచి విషయమన్నారు. ఐఎఫ్పీలు ఉన్నాయని, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చారన్నారు. ఏపీని ప్రతి రాష్ట్రం ఆదర్శంగా తీసుకుని చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉందన్నారు. అధికారులతో మాట్లాడినప్పుడు విద్యారంగంపై సీఎంకు ఉన్న వ్యక్తిగత శ్రద్ధ వల్లే ఈ స్థాయి ఫలితాలు వచ్చాయని చెప్పారని ఆయన్ను వేదికపైకి చప్పట్ల నడుమ ఆహ్వానించారు.