2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందుకోసం అన్ని అస్త్రాలను బయటకు తీస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది మెజారిటీ సర్వే సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా ఇంటిలిజెన్స్ నివేదిక ప్రకారం 117 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుపొందే అవకాశముందని అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. సర్వే సంస్థలు, ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికలు పరిశీలిస్తూ నియోజకవర్గాల వారీగా పార్టీ, అభ్యర్థుల పరిస్థితులపై సీఎం ముమ్మరంగా సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత ఎన్నికల్లో 5 వేలలోపు, 10 వేల లోపు మెజార్టీ తో విజయం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గాలు 33 ఉన్నాయి. తిరిగి వీటిలో గెలుపొందడం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో తిరిగి విజయం సాధించడంతో పాటు మెజార్టీ భారీగా సాధించాలనే పట్టుదలతో సీఎం జగన్ ఉన్నారు. దీనిపై నియోజకవర్గ పరిశీలకులతో చర్చించి అక్కడ చేపట్టాల్సిన చర్యలు, పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది.
2019 ఎన్నికలో ఐదు వేలలోపు మెజారిటీతో గెలిచిన నియోజక వర్గాలను గమనిస్తే.. విజయవాడ సెంట్రల్, తిరుపతి, పొన్నూరు, నెల్లూరు సిటీ, తణుకు, నగరి, కొత్తపేట, ఏలూరు, యలమంచిలి తాడికొండ, జగ్గయ్యపేట నియోజకవర్గాలలో ఐదు వేలలోపు మెజార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
2019 ఎన్నికలో పది వేలలోపు మెజారిటీతో గెలిచిన నియోజక వర్గాలను పరిశీలిస్తే..రామచంద్రాపురం, మంగళగిరి, కర్నూలు, ముమ్మిడివరం, శ్రీకాకుళం, మచిలీపట్నం, విజయనగరం, నరసాపురం, ప్రత్తిపాడు, తాడిపత్రి, విజయవాడ వెస్ట్, పెడన, పీలేరు, అనకాపల్లి, చిలకలూరిపేట, బొబ్బిలి, భీమవరం, కాకినాడ రూరల్, సంతనూతలపాడు, కైకలూరు, భీమిలి, వేమూరు నియోజక వర్గాల్లో పది వేలలోపు ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గాల్లో ఈ దఫా విజయం సాధిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం అని వైసీపీ అధిష్టానం అంచనా వేస్తోంది. అందుకే ఈ నియోజకవర్గాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. 2019లో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లు ఎన్నికలు జరిగాయి. 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో 151 స్థానాల్లో వైసీపీ విజయదుందుభి మ్రోగించింది. మొదటిసారి ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగిన టీడీపీ 23 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
జనసేన, కమ్యూనిస్టు పార్టీలు కలిసిపోటీ చేయగా కొన్ని నియోజకవర్గాల్లో గట్టిగా ఓట్లు చీల్చగలిగారు. కాంగ్రెస్, బీజేపీ నామ మాత్రపు ఓటింగ్ తో సరిపెట్టుకున్నాయి. ఈ సారి ఎన్నికల పూర్తిగా మారిపోయాయి . 2014 లో లాగే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. 2019లో ఒక్క శాతం ఓట్లు కూడా రాని కాంగ్రెస్ కు , పీసిసి అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓట్లు పెరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిసి ఈ ఎన్నికల బరిలోకి దిగనుంది.
ప్రజలతోనే నేరుగా మా పొత్తు అంటూ సీఎం జగన్ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. పార్టీ పెట్టిన రోజు నుంచి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా జగన్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. వివిధ రకాలు సర్వేలు నిర్వహించి ప్రజల్లో పట్టున్న నాయకులకే టిక్కెట్లు కేటాయించారు. సుమారు 50 మంది సిట్టింగ్ లకు టిక్కెట్లు నిరాకరిస్తూ, టికెట్ ఇవ్వలేకపోవడం వెనుక కారణాలను జగన్ మోహన్ రెడ్డి స్వయంగా వివరించారు. స్వల్ప మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యేలను తీసి పక్కన పెట్టారు. మరి కొందరిని నియోజకవర్గాలు మార్చి పోటీ చేయిస్తున్నారు. టిక్కెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేశారు. 50 శాతం బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లకు టిక్కెట్లు కేటాయించడం ద్వారా సరికొత్త రాజకీయానికి ముఖ్యమంత్రి జగన్ నాంది పలికారు. క్షేత్రస్థాయిలో అభ్యర్థుల గెలుపు బాధ్యతల్ని ప్రాంతాల వారీగా ఎంపిక చేసి రీజనల్ కో ఆర్డినేటర్లుకు , ఇంఛార్జిలకు అప్పగించారు.
సిద్ధం సభలు, కూటమి అభ్యర్థుల మధ్య సీట్ల పంచాయితీ తరువాత తమ గ్రాఫ్ మరింత పెరిగినట్లు వైసీపీ పెద్దలు అంచ వేస్తున్నారు. తమ పాలనలో సాగిన సంక్షేమ పాలన ఓట్లు కురిపిస్తోందనే ధీమాతో సీఎం జగన్ ఉన్నారు.వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఎంపిక పూర్తవ్వడంతో క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరంగా అభ్యర్థులు సాగిస్తున్నారు. ఈ నెల 27 నుంచి మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సుయాత్రలు చేపట్టున్నారు. జనంలోకి జగన్ వస్తే నియోజకవర్గాల్లో వైసీపీ గ్రాఫ్ మరింత పెరుగుతోందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. వైసీపీ వర్సెస్ కూటమి మధ్య హోరాహోరీగా సాగే ఎన్నికల పోరులో ఎవరు గెలిచిన మెజార్టీ స్వల్పంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలో గతంతో మెజార్టీ తగ్గిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించడం ద్వారా తిరిగి ఆస్థానాలను గెలుచుకోవాలని భావిస్తున్న వైసీపీ అధిష్టానం ఆ నియోజక వర్గాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.వైఎస్సార్సీపీ అధిష్టానం వ్యూహాల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని రానున్న ఎన్నికలలో తేలనుంది.