మేమంతా సిద్ధం బస్సు యాత్ర కర్నూలు జిల్లాలో జరుగుతోంది. నాలుగో రోజు తుగ్గలి, రాతన గ్రామాల ప్రజలతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఆయా గ్రామాలకు సంబంధించి ప్రభుత్వం వల్ల జరిగిన లబ్ధిని జగన్ వివరించారు. గ్రామాల్లోని రెండు సచివాలయాల పరిధిలో దాదాపుగా 10 వేల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ గత ప్రభుత్వంలో ఏమి జరిగిందో చూశారు. ఈరోజు మన ప్రభుత్వంలో ప్రస్ఫుటమైన మార్పులు ఈ కనిపిస్తున్నాయని సీఎం అన్నారు.
తుగ్గలి గ్రామానికి సంబంధించి 1,748 ఇళ్లుండగా, మన పాలనలో నేరుగా అక్కచెల్లమ్మల ఖాతాల్లోకి డబ్బులు పడ్డాయి. ఎక్కడా లంచాలు అడిగే వారు లేరు. వివక్షకు చోటు లేదు. కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీ అని చూడకుండా, ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటు వేయకపోయినా లబ్ధి చేకూర్చాం. 1,666 గృహాలకు పథకాలు అందించాం. గత ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా, లంచాలు ఇస్తే కానీ పని జరిగేది కాదు. 5,200 జనాభా ఉంటే 95 శాతం మందికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమైంది. 58 నెలల కాలంలో రూ.29.65 కోట్లు అందించాం. గతానికి.. ఇప్పటి నంబర్లకు తేడా గమనిస్తే ఆశ్చర్యం కలగకమానదు. అమ్మఒడి పథకం కింద రూ.2.91 కోట్లు, వెఎస్సార్ చేయూత ద్వారా రూ.2.30 కోట్లు, జగనన్న విద్యా దీవెనలో భాగంగా రూ. 1.16 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.51 లక్షలు, ఆసరా కింద రూ.1.95 లక్షలు, సున్నా వడ్డీ కింద రూ.60 లక్షలు, ఇళ్లు 66 కేటాయించాం. వైఎస్సార్ కల్యాణమస్తు ద్వారా రూ.3 లక్షలు, సామాజిక పింఛన్ల కోసం రూ.7.58 కోట్లు అందించాం. రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.6.15 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీని సరికొత్త మార్పులతో తెచ్చాం. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకాల ద్వారా రూ.కోటి వరకు ఖర్చు చేసి ఉచితంగా వైద్యం అందించాం.
ఇక రాతన గ్రామంలో 1,569 ఇళ్లున్నాయి. 4,888 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ 95 శాతం మందికి పథకాల వల్ల లబ్ధి జరిగింది. రూ.26.59 కోట్లను అక్కచెల్లమ్మలకు అందించాం. అమ్మఒడి కింద రూ. 2.50 కోట్లు, వైఎస్సార్ చేయూత ద్వారా రూ.2.19 కోట్లు, జగనన్న విద్యా దీవెనలో భాగంగా రూ.1.26 కోట్లు వెచ్చించి తల్లిదండ్రులకు అప్పుల బాధ తప్పించాం. జగనన్న వసతి దీవెన కింద రూ.54 లక్షలు, ఆసరా కింద రూ.65 లక్షలు, సున్నా వడ్డీ కింద రూ.15 లక్షలు, ఇళ్లు 122 కేటాయించాం. వైఎస్సార్ కల్యాణమస్తు ద్వారా రూ. 4.80 లక్షలు లబ్ధి చేకూర్చాం. ఇక్కడ పెన్షన్లకు సంబంధించి రూ. 7.54 కోట్లు ఖర్చు చేశాం. రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.5.49 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీని సరికొత్త మార్పులతో తెచ్చాం. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకాల కింద రూ. 84 లక్షలు ఖర్చు చేశాం.
ఇటువంటి విప్లవాత్మక మార్పులు గత ప్రభుత్వాల్లో ఎందుకు కనిపించలేదు.. మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు ఇంత గొప్పగా మార్పు కనిపిస్తోందో.. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ రోజు సమాజంలో ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు కనిపిస్తున్నాయని జగన్ అన్నారు.