వైఎస్సార్ కాంగ్రెస్లో వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతల చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర చిత్తూరు జిల్లాకు చేరగా చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల వారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేత కండువాలు కప్పించుకున్నారు. ఇందులో ముఖ్యమైన వ్యక్తి ఆ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు రావూరి ఈశ్వరరావు. ఈయన చాలాకాలం తెలుగుదేశంలో ఉన్నారు. పార్టీ అభివృద్ధి కోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. ప్రజల కోసం విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కానీ అధినేత చంద్రబాబు నాయుడు ఏనాడూ పట్టించుకోలేదు. కాపు సామాజికవర్గానికి రావూరి పలుమార్లు చిత్తూరు టికెట్ ఇవ్వాలని అడిగారు. అయితే ఒక్కసారి కూడా ఆ దిశగా ఆలోచన చేయలేదు. దీంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నేడు జగన్ను కలిసి వైఎస్సార్సీపీలో చేరారు.
ఇక చిత్తూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్, కాంగ్రెస్ నాయకురాలు సరళామేరీ, టీడీపీ నాయకురాలు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, బంగారుపాళ్యం మండలం నలగాంపల్లె మాజీ సర్పంచ్ టి.థామస్, కుమారస్వామి నాయుడు, సందీప్, డాక్టర్ ప్రదీప్ తదితరులు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.
లలితకుమారి విషయానికొస్తే ఆమెకు ప్రజాబలం ఉంది. చాలాకాలం నుంచి టీడీపీలో ఉన్నారు. 2014, 19లో పూతలపట్టు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు పట్టించుకోలేదు. 2024లో అవకాశం ఇవ్వాలని అడిగినా టీడీపీ అధిష్టానం చిన్నచూపు చూసింది. మురళీమోహన్ అనే వ్యక్తిని నిలబెట్టింది. మొత్తంగా ఎన్నికల వేళ చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో టీడీపీకి షాక్ తగిలిందనే చెప్పాలి. అధినేత వ్యవహారశైలి నచ్చక అనేకమంది పార్టీని వీడుతున్నారని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.