చంద్రబాబుకు హామీలివ్వడం వాటిని గాలికి వదిలేయడం వెన్నతో పెట్టిన విద్య.. ఎన్నికల్లో గెలిచేందుకు ఎలాగూ ఇచ్చిన హామీలను అమలుచేయమనే ధైర్యంతో నోటికి వచ్చిన హామీలిచ్చి ఆ హామీలను నమ్మినవారి నోట్లో మట్టికొట్టడం బాబుకు మొదటినుండీ ఉన్న అలవాటే.. ఈ క్రమంలో పెన్షన్ల విషయంలో చంద్రబాబు చేసిన మోసాలూ అన్నీ ఇన్నీ కావు.. ఇప్పుడు బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానని, అర్హులైనవారికి 4వేల పెన్షన్ అందిస్తానని ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్న చంద్రబాబు గతంలోపెన్షన్ల విషయంలో చేసిన ఘనకార్యాలను పరిశీలిస్తే బాబు ఎంత మోసగాడో ప్రజలకు అవగతమవుతుంది.
ఇప్పుడు బీసీలకు ఇస్తున్న హామీ మాదిరిగానే 2014 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్ అంటూ హామీ ఇచ్చాడు చంద్రబాబు. ఆ మాటలు నమ్మిన గిరిజనులు ఎంతో సంతోషించి బాబుకు ఓట్లేసి గెలిపిస్తే, ఆ హామీని నెరవేర్చకుండా ఐదేళ్లు కాలక్షేపం చేసిన చంద్రబాబు ఎన్నికల ముందు కొత్త డ్రామాకి తెరలేపారు. ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరుగుతాయనగా 2019 ఫిబ్రవరి 10 న చంద్రబాబు 50 ఏళ్ళు దాటిన గిరిజనులకు పెన్షన్ ఇస్తా అప్లై చేసుకోమని చెప్పడంతో ఆయన మాటలు నమ్మిన గిరిజనులు అప్లై చేసుకున్నారు. కానీ ఎంపీడీవోల ద్వారా ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వకుండా గిరిజనులను మోసం చేసిన చంద్రబాబు అదే నాటకాన్నికొనసాగిస్తూ ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చి గెలవాలనే లక్ష్యంతో, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తా అంటూ కాకమ్మ కథలు చెబుతున్నాడు. మేనిఫెస్టోలో హామీని అడుగుతారని ఏకంగా మేనిఫెస్టోనే మాయం చేసిన ఘనుడు చంద్రబాబు.
అంతేకాకుండా అర్హులకు రూ. 4000/- పెన్షన్ ఇస్తానంటూ కబుర్లు చెబుతున్న చంద్రబాబు 2019 జనవరి వరకూ కేవలం రూ. 1000/- మాత్రమే పెన్షన్ గా అందించాడు. ఎప్పుడైతే అప్పటి ప్రతిపక్ష నేత నవరత్న పథకాల హామీల్లో భాగంగా రూ.2000/- ప్రకటించాడో వెంటనే ఆ హామీని కాపీ కొట్టి ఎన్నికలకు రెండు నెలల ముందు నుండి రూ. 2000/- పెన్షన్ అందించడం మొదలుపెట్టాడు. ఒకవేళ చంద్రబాబు హామీని నమ్మి కనుక గెలిపిస్తే 2029 ఎన్నికలకు ఓ నెలముందు నుండి ఇప్పడు చంద్రబాబు ఇస్తానన్న 4000/- పెన్షన్ ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. లేదా అదికూడా ఇవ్వకుండానే ఎప్పటిలానే మళ్ళీ ఎన్నికల కోసం కొత్త హామీలు ఇవ్వొచ్చు. గతంలో పెన్షన్ల విషయంలో గిరిజనులను మోసం చేసిన బాబుకు బీసీలను మోసం చేయడం చాలా చిన్న విషయమే అనుకోవచ్చు. నమ్మిన ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు మొదటినుండి ఉన్న అలవాటే కాబట్టి ప్రజలంతా చంద్రబాబు హామీల విషయంలో విజ్ఞతతో అలోచించి ఓటు వేయాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.