వృద్ధులు ఎదుర్కొంటున్న బాధలు చూసి చలించిపోయిన అప్పటి ప్రతిపక్ష నేత జగన్ తాను అధికారంలోకి వస్తే 2000 రూపాయల పెన్షన్ అందిస్తానని హామీ ఇచ్చారు. అయితే నాటి సీఎం ఆ క్రెడిట్ తానే తీసుకోవాలని ఎన్నికలకు కొన్ని నెలల ముందునుండి 2000 రూపాయల పెన్షన్ అందించడం మొదలుపెట్టారు. కేవలం జగన్ వల్లనే వృద్ధులకు రాష్ట్రంలో లబ్ది చేకూరిందన్నది అందరూ ఒప్పుకుని తీరాల్సిన సత్యం.
ఒకప్పుడు వృద్ధాప్యంలో వృద్ధులకు ఆర్ధిక భరోసాగా ప్రభుత్వం అందించే పెన్షన్ ఉపయోగపడేది. కానీ చాలీ చాలని పెన్షన్ వృద్ధులకు అందేది. అదికూడా అర్హులకు కాకుండా కేవలం తమకి అనుకూలంగా ఉన్నవారికే పెన్షన్ అందించేది. వృద్ధాప్యంలో ఏ పని చేసుకోలేని పండుటాకుల్లాంటి వృద్ధులకు పెన్షన్ అందించేందుకు నాటి చంద్రబాబు ప్రభుత్వం పెద్ద మనసు చూపేది కాదు. పెన్షన్ కోసం జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా కరుణించేవారు కాదు.. ఎక్కడ జన్మభూమి సభ జరిగినా అక్కడ వృద్ధులు తమకు పెన్షన్ ఇప్పించాలని వేడుకొనేందుకు క్యూ కట్టేవారు.
ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఎంత పెద్ద నాయకుడిని కలిసి మొరపెట్టుకున్నా పెన్షన్ ఇచ్చేందుకు నాటి చంద్రబాబు సర్కారుకు మనసు వచ్చేది కాదు. దాంతో ఎందరో అర్హులైన వృద్ధులు వృద్ధాప్య దశలో ఆర్థిక భరోసా దక్కక, కడుపునిండా తిండికి నోచుకోక, నా అన్నవారు లేక, పేదరికంతో మగ్గిపోయి తనువు చాలించారన్న మాట వాస్తవం. ఈ పరిస్థితిని గమనించిన వైఎస్ జగన్ వృద్ధులకు అండగా ఉంటానని అర్హులైన అందరికీ కులమతప్రాంతాలకు,పార్టీలకి సంబంధం లేకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా పెన్షన్ ఇస్తానని ప్రకటించారు.
అంతేకాక జన్మభూమి కమిటీలకు బాధ లేకుండా నేరుగా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే 2000 పెన్షన్ కూడా అందిస్తామని తెలిపారు. దాంతో హడావిడిగా చంద్రబాబు ప్రభుత్వం 2000 పెన్షన్ వృద్ధులకు అందించింది. అనంతరం 2019 ఎన్నికలకు ముందు పెన్షన్ 3000 చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే 3000 పెన్షన్ అందిస్తూ మాట నిలబెట్టుకున్నారు. పండుటాకుల్లాంటి వృద్ధులకు 2000 పెన్షన్ అందించి అండగా ఉన్న పార్టీ తమదని చెప్పుకుంటున్న చంద్రబాబు గతాన్ని మర్చిపోయినట్లున్నాడు. పెన్షన్ల మంజూరు కోసం జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగిన ఎందరో వృద్ధులను పొట్టనపెట్టుకున్న చంద్రబాబు, నేడు ఆ విషయాలే జరగనట్లు ప్రవర్తించడం సిగ్గుచేటు.
నాడు జన్మభూమి కమిటీలు మంజూరు చేస్తేనే వృద్ధులకు పెన్షన్లు దక్కేవి. కానీ నేడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత ఉన్న వృద్ధులకు నేరుగా ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేస్తుంది. నాడు పెన్షన్లను తీసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వృద్దులు తిరగాల్సి వచ్చేది. కానీ నేడు నేరుగా ఇంటికే వచ్చి ఇస్తుంది జగన్ ప్రభుత్వం. నాడు జన్మభూమి కమిటీల ద్వారా పార్టీ,కుల,మత భేదాలతో అవసరంలో ఉన్న అర్హులైన వృద్ధులకు పెన్షన్ రాకుండా చేసి ఎందరో వృద్ధులను చంద్రబాబు పొట్టనబెట్టుకుంటే నేడు సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులను గుర్తించి అర్హతే ప్రామాణికంగా పెన్షన్ అందజేస్తుంది వైఎస్ జగన్ ప్రభుత్వం.. నాటి చంద్రబాబు హయాంలో పెన్షన్ పంపిణీకి నేటి జగన్ హయాంలో పెన్షన్ పంపిణీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.