ఏపీలో ఎన్నికల సమరభేరి నేపథ్యంలో వివిధ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలంతా ఈ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా నేడు ఈ బస్సు యాత్రకు బ్రేక్ పడింది.
నేడు శ్రీ రామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ యాత్రకు విరామం ఇచ్చారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి తణుకు మండలం తేతలిలో బస చేసిన సీఎం జగన్ రేపు ఉదయం తేతలి నుండి తిరిగి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. రేపు జగన్ బస చేసిన తేతలి శిబిరం నుంచి బయల్దేరి రావులపాలెం నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర జరగనుంది. రావులపాలెం జాతీయ రహదారిపై రోడ్షో నిర్వహించనున్నారు. కడియం మీదుగా పొట్టిలంక నుంచి బుర్రిలంక మీదుగా వేమగిరి వరకు రోడ్షో నిర్వహించనున్నారు. వేమగిరి నుంచి మోరంపూడి మీదుగా రాజమండ్రి సిటీలోకి రోడ్ షో రానుంది.
కాగా గతంలో రంజాన్ సందర్భంగా బస్సు యాత్రకు సీఎం జగన్ విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో జగన్ పై రాయితో దాడికి పాల్పడిన కారణంగా వైద్యుల సూచన మేరకు విరామం ప్రకటించారు. అనంతరం గాయాన్ని సైతం లెక్క చేయకుండా బస్సు యాత్రను కొనసాగిస్తున్న జగన్, తాజాగా శ్రీరామనవమి సందర్భంగా మరోసారి విరామం ప్రకటించారు.