తిరుపతి అసెంబ్లీ సీటు విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తప్పటడుగులు వేస్తున్నారని అటు జనసైనికులు.. ఇటు తెలుగుదేశం శ్రేణులు భగ్గుమంటున్నాయి. స్థానికేతరుడైన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు అవకాశమిస్తే సహించేది లేదని తిరగబడ్డారు. ఏకంగా సమావేశం పెట్టి మరీ ఆయన్ను పెట్టొద్దని డిమాండ్ చేశారు.
తిరుపతికి దేశ వ్యాప్తంగా అధిక ప్రాధాన్యం ఉంది. సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి ఆలయం ఉన్న ప్రాంతం. ఇక్కడ పట్టు కోసం నిత్యం రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తనయుడు అభినయ్రెడ్డి పోటీ చేయడం ఖాయమైంది. పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు ఈ సీటును జనసేనకు కేటాయించారు. పవన్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తర్వాత ఆయన పార్టీకి చెందిన కిరణ్ రాయల్, హరిప్రసాద్ల పేర్లు వినిపించాయి. అయితే ఈ స్థానాన్ని వదులుకోవడం లేని ఇష్టం లేని బాబు తన పార్టీ నుంచి గంటా నరహరి అనే పారిశ్రామికవేత్తను రెండురోజుల క్రితం జనసేనలోకి పంపారు. ఈయనే పోటీ చేయొచ్చని అందరూ భావించారు.
కానీ అనూహ్యంగా చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు తెరపైకి వచ్చారు. ఈయన గతంలో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీడీపీ టికెట్ దక్కలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారు. కానీ ఓడిపోయారు. అయినా 2019లో సీటు ఇవ్వగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సునామీలో గెలిచేశారు. ఈసారి చిత్తూరులో వేరే వారికి సీటు ఇస్తున్నారు. దీంతో ఆరణి పక్కచూపులు చూశారు. పవన్ను కలిసి ఆయన పార్టీలో చేరారు. ఎన్నికలకు ఎంత డబ్బు కావాలన్నా సర్దుతానని, తిరుపతిలో చాన్స్ ఇవ్వాలని కోరారు. నగదుకు ఆశ పడిన సేనాని ఓకే చెప్పేశారు. ఎల్లో మీడియా కూడా ఆరణి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.
ఇప్పుడు తిరుపతిలోని జనసేన, టీడీపీ నేతలు శ్రీనివాసులును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గురువారం రెండు పార్టీల్లోని కీలక నేతలు సమావేశమై స్థానికేతరుడికి టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా ఆరణి గోబ్యాక్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. స్థానికుడికే టికెట్ ఇవ్వాలన్నారు. ఎవరైతే పవన్ వద్దకు ఆయన్ను తీసుకెళ్లారో వాళ్లు కూడా సమావేశంలో పాల్గొనడం విశేషం. మరి సేనాని సర్దిచెబుతారో.. లేక బడా కాంట్రాక్టర్ అయిన శ్రీనివాసులు డబ్బు మూటలకు లొంగిపోతారో..