ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతన్నలకు తీపికబురు చెప్పింది. పవర్ లూమ్ చేనేతలకు విద్యుత్ సబ్సిడీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యూనిట్కి 94 పైసలు రాయితీ కల్పిస్తూనే ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.1 నుంచి 6 పైసలకి తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పవర్ లూమ్స్ ద్వారా చీరలను నేసే నేతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చేనేత మగ్గంపై నేసే చీరలను హ్యాండ్ లూమ్స్ అని, విద్యుత్ సాయంతో నడిచే యంత్రాలతో తయారుచేసే చీరలను పవర్ లూమ్స్ అని అంటారు. కాగా పవర్ లూమ్ యంత్రాల వల్ల విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా వస్తున్నాయని, దాంతో తమకు తగిన ప్రతిఫలం లభించడం లేదని, సబ్సిడీ కల్పించి తమను ఆదుకోవాలంటూ గతకొంతకాలంగా పవర్ లూమ్ కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్న నేపథ్యంలో జగన్ సర్కారు సానుకూలంగా స్పందించి పవర్ లూమ్లకు విద్యుత్ సబ్సిడీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో తమ కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పవర్ లూమ్ చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.