అంగన్వాడీల డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన జగన్ ప్రభుత్వం
రాష్ట్రంలో కొన్ని రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసినదే.. అయితే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అంగన్వాడీల డిమాండ్లపై జరిగిన సుదీర్ఘ సమావేశం అనంతరం జనవరి 23 నుంచి అంగన్వాడీలు విధుల్లోకి తిరిగిచేరారు.
ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో అంగన్వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది.
వేతనాల పెంపుపై.. ఇటు ప్రభుత్వం అటు అంగన్వాడీ యూనియన్లు పరస్పర అంగీకారంతో జూలై నుంచి అమలు చేసే దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.
అంగన్వాడీల శ్రేయస్సు, సంక్షేమం దృష్ట్యా రిటైర్మెంట్ బెనిఫిట్స్ను వర్కర్లకు రూ.50 వేల నుంచి ఏకంగా రూ.1.20 లక్షలకు, హెల్పర్లకు రూ.20 వేల నుంచి రూ.60 వేలకు పెంచారు.
అంగన్వాడీలలో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చుల కింద 20 వేలు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలు చేసిన సమ్మె కాలానికి కూడా జీతాలు ఇస్తామని.. సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వేతనాల పెంపు పై చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని మినిట్స్ లో నమోదు చేస్తామని.. గ్రాట్యువిటీకి సంబంధించి కేంద్రం నిబంధనలను పాటిస్తామని కూడా వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్ళ కు పెంచారు.. ప్రమోషన్ల కోసం వయో పరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచారు. కేంద్ర నిబంధనల ప్రకారం మినీ అంగన్వాడీల అప్గ్రేడ్ చేస్తామని వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విజవంతం అయ్యాయని.. మా డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించారన్నారు. తిరిగి తాము విధుల్లోకి వెళుతున్నట్టు తెలిపారు. అంగన్వాడీలకు ప్రత్యేకంగా వైఎస్సార్ బీమా, అంగన్వాడీల బీమా అమలు చేస్తామనడం సంతోషంగా ఉందన్నారు. టిఏ బిల్లుల అంశంలో కేంద్రం నుంచీ వచ్చే లోపు రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకుందని.. సీఎఫ్ఎంఎస్ తీసేసి సంక్షేమ పధకాలు అంగన్వాడీలకు వర్తింపుచేస్తామన్నారని ఆనందం వ్యక్తం చేశారు.