రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల గడువు సమీపిస్తోన్న తరుణంలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ప్రచారం సందర్బంగా చంద్రబాబు వినియోగిస్తున్న హెలికాప్టర్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. టీడీపీ పొత్తేమో ఎన్డీఏ కూటమితో ఉన్న, చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ వారికి చెందిన హెలికాప్టర్లు వినియోగిస్తున్నాడు.
ఎన్నికల్లో చంద్రబాబు తన ప్రచార కార్యక్రమాల కోసం తన ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుల హెలికాప్టర్లు, ఛాపర్లు వాడుకుంటోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన ప్రచార కార్యక్రమాల్లో ఒక చోటి నుంచి మరో చోటికి రాకపోకలు సాగించడానికి బెల్ 429 రకానికి చెందిన ఛాపర్లను చంద్రబాబు వినియోగించుకుంటున్నారు.
ఈ హెలికాప్టర్లు కేళాచంద్ర గ్రూప్కు చెందినవి. ఈ గ్రూప్ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, విద్యుత్ శాఖ మంత్రి కేజే జార్జ్ కంపెనీకి చెందినవి. బీజేపీతో పొత్తు, ఎన్డీఏలో భాగస్వామ్యపక్షంగా ఉంటూ కాంగ్రెస్ నాయకుడి ఏవియేషన్ కంపెనీకి చెందిన ఛాపర్లను వాడుతోండటం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇవే ఛాపర్లు, హెలికాప్టర్లను ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు విసృతంగా వినియోగిస్తోన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ సైతం వాటినే వాడుతున్నారు. ఆ జాబితాలో బీజేపీ మిత్రపక్షం చీఫ్ చంద్రబాబు కూడా చేరడం చర్చనీయాంశమౌతోంది.