ఏప్రిల్ 13వ తేదీ విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ సమీపంలో సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆగంతకుడు జగన్ పై రాయి విసరగా ఆయన ఎడమ కన్ను పైభాగంలో తగిలి గాయమైంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సతీష్ను విజయవాడ కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది.
ముఖ్యమంత్రి జగన్ పై రాళ్ళ దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సతీష్ను వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించాల్సిందిగా పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సతీష్ను మూడురోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సతీష్ను లాయర్, తల్లిదండ్రుల సమక్షంలోనే విచారించాలని, విచారణ సమయంలో థర్డ్ డిగ్రీని ఉపయోగించకూడదని, ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ సతీష్ను విచారించాలని కోర్టు ఆదేశాలిచ్చింది.
కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 27 వరకూ పోలీసులు సతీష్ ను కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృస్టించిన ఈ కేసులో విచారణలో సతీష్ ఎలాంటి వివరాలు బయటపెట్టనున్నాడనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.