తాగు,సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట నిలబెట్టుకుంటూ.. కుప్పం నియోజవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయుకట్టకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 4.02 లక్షల జనాభాకు త్రాగునీరు అందిస్తూ.. అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తిచేసి నేడు కుప్పం నియోజకవర్గానికి చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలను సీఎం జగన్ విడుదల చేశారు.. అనంతరం శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లె వద్ద జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే..
కుప్పంలో పండగ వాతావరణం…
దేవుడి దయ, ప్రజలందరి చల్లనీ దీవెనలతో ఈరోజు కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. కొండలు, గుట్టలు దాటుకుని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది. 2022, సెప్టెంబర్ 23న ఇదే కుప్పం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు హాజరైనప్పుడు మీ అందరికీ ఒక మాటిచ్చాను. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేస్తామని, కృష్ణా జలాలు తరలిస్తామని, కుప్పం నియోజకవర్గానికి ఆ నీళ్లు తెస్తామని ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని కుప్పానికి ఈరోజు కృష్ణా జలాలు తీసుకురాగలిగానని సగర్వంగా తెలియజేస్తున్నాను.
మరో రెండు ప్రాజెక్టు పనులకూ శ్రీకారం…
కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా మరో రెండు ప్రాజెక్టులను కూడా మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ, మరో రెండు రిజర్వాయర్ల ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు కూడా శ్రీకారం చుట్టే దిశగా వాటికి కూడా పరిపాలన అనుమతులు ఇచ్చాం. కృష్ణా జలాలలను ఇక్కడకు తీసుకురావడం ద్వారా దాదాపు 6300 ఎకరాలకు సాగునీరు అందిస్తూ, కుప్పం నియోజకవర్గం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులు నింపుతూ ఇప్పటికే అడుగులు పూర్తి కావచ్చాయి. గుడిపల్లి మండలంలోని యామగానిపల్లె వద్ద ఒక రిజర్వాయర్ను, శాంతిపురం మండలం మాదనపల్లె వద్ద మరో రిజర్వాయర్ ను రూ.535 కోట్లతో నిర్మించడానికి, అదనంగా దీని వల్ల మరో 5 వేల ఎకరాలకు తాగు, సాగు నీరు అందించేందుకు మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటికి పరిపాలన అనుమతులు కూడా ఇప్పటికే మంజూరు చేశాం. ఈ 2 ప్రాజెక్టులే కాకుండా రాబోయే రోజుల్లో మరో ముఖ్యమైన పాలారు ప్రాజెక్టుకు సంబంధించి 0.6 టీఎంసీల కెపాసిటీతో చిన్నపాటి రిజర్వాయర్ను రూ.215 కోట్లతో కట్టడానికి కూడా పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది.
కుప్పానికే ప్రయోజనం లేని నాయుకుడు బాబు..
35 సంవత్సరాల్లో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేక, కుప్పానికే నీరు తీసుకొనిరాలేదు అంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ ఆలోచన చేయాలి. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ తెలుసు. దాన్ని నీరుపారే కాల్వగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులు కనిపిస్తాయి.ఇక్కడి ప్రజలకు గానీ, పక్కనే ఉన్న పలమనేరులో కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న 2 లక్షలమంది ప్రజలకు మంచి నీళ్లు ఎలా అందించాలి?, సాగునీరు ఎలా అందించాలన్న అంశంపై కనీసం ఆయన దృష్టి కూడా లేదు.
కుప్పం ప్రజల సహనానికి జోహార్లు…
2019 ఎన్నికలకు ముందు పనులు పూర్తిచేయకపోగా, లాభాలు వచ్చే పనులు మాత్రమే చేసి, మిగిలిన ముఖ్యమైన పనులు వదిలేసి, తన అస్మదీయ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు సొమ్ములు ఇచ్చాడు చంద్రబాబునాయుడు. ఇది మన కళ్లెదుటనే కనిపించిన విషయం. ఇంత అన్యాయపు నాయకుడిని, తన నియోజకవర్గ ప్రజల్నే దోచుకున్న నాయకుడిని, తన నియోజకవర్గానికి దాహార్తిని కూడా తీర్చని ఈ నాయకుడిని, ఇంతకాలం భరించిన ఈ కుప్పం ప్రజలందరికీ మీ సహనానికి, మీ మంచితనానికి నా జోహార్లు చెబుతున్నాను.
ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగిందో ఆలోచన చేయాలి.
35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ, 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేసిన చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా? కేవలం 58 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా? అన్నది ఆలోచన చేయాలి.
కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది ఎవరంటే.. మీ జగన్. కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే.. మీ జగన్..కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది, కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది కూడా మీ జగన్. చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీ లాభాల కోసం మూసేయించి, చిత్తూరు డెయిరీని తెరిపించడమే కాకుండా అమూల్ ను తీసుకొచ్చి ఇదే కుప్పం, ఇదే పలమనేరు పాడి రైతులందరికీ గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరంటే మీ జగన్. ఇదే చిత్తూరు జిల్లాకు ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన వెల్లూర్ సీఎంసీ మెడికల్ కాలేజీ. ఎవరికి బాగా లేకున్నా అక్కడికి వెళ్లి వైద్యం చేయించుకుంటారు. అటువంటి హాస్పిటల్ రాకుండా చిత్తూరు జిల్లాకు రాకుండా, కుప్పం ప్రజలకు అందుబాటులోకి రాకుండా, పలమనేరు ప్రజలకు రాకుండా చేసింది ఎవరంటే చంద్రబాబు, ఈనాడు రామోజీరావు వియ్యంకుడు, చంద్రబాబు పార్టనర్.వీళ్లిద్దరూ కలిసి ఆ కాలేజీ నిర్మాణం ముందుకు తీసుకెళ్లకపోతే మళ్లీ ఆ కాలేజీని చిత్తూరులో పున:ప్రారంభించేట్టటుగా చేసింది ఎవరంటే మీ జగన్.కుప్పంలో మరో రెండు విద్యత్తు సబ్ స్టేషన్లు నిర్మించింది, కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీసు కాంప్లెక్సులు నిర్మిస్తోంది ఎవరంటే మీ జగన్. కుప్పం మున్సిపాలిటీకి రూ.66 కోట్లు ఇచ్చి పనులు మంజూరు చేసి ఆ పనులుజరిగిస్తున్నది ఎవరంటే మీ జగన్.
కుప్పంలో 93.29 శాతం కుటుంబాలకు సంక్షేమం..
కుప్పం నియోజకవర్గంలో మొత్తం 87,941 కుటుంబాలుంటే ఈ 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మన ప్రభుత్వ పథకాలు, నవరత్నాలు అందుకున్న కుటుంబాలు.. అక్షరాలా ఏకంగా 82,039. అంటే 93.29 శాతం కుటుంబాలు మన ప్రభుత్వ పథకాలు అందుకున్నారు. మన నవరత్నాలు అందుకున్నారు. మన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంటే 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా డీబీటీ ద్వారా లంచాలు, వివక్ష లేకుండా రాష్ట్ర మొత్తమ్మీద నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.55 లక్షల కోట్లు నేరుగా వెళ్లింది. ఇందులో కుప్పం నియోజకవర్గంలోని నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసిన మొత్తం అక్షరాలా రూ.1400 కోట్లు. చంద్రబాబు 5 సంవత్సరాలు.. మీ బిడ్డ హయాంలో ఈ 57 నెలల కాలం గమనిస్తే, చంద్రబాబు హయాంలో రూ.200 కోట్లు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితుల నుంచి ఈరోజు ఏకంగా రూ.507 కోట్లు నా అవ్వాతాతలకు, వికలాంగ సోదరులకు, అక్కచెల్లెమ్మలకు, వింతువులకు ఈరోజు మీ బిడ్డ ఇస్తున్నాడు. మనందరి ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతు భరోసాగా ఒక్క కుప్పంలోనే ఏకంగా 44,640 మంది రైతన్నలకు రైతు భరోసా పథకం ద్వారా ఏకంగా రూ.214 కోట్లు నేరుగా ఇవ్వడం జరిగింది.
పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాలన్నీ కూడా మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని చంద్రబాబు దగా చేశాడు. అంతే కాకుండా 2016 అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేశాడు.అక్కచెల్లెమ్మల జీవితాలు చిన్నాభిన్నమైన పరిస్థితి గతంలో ఉంటే మనందరి ప్రభుత్వం వైయస్సార్ ఆసరా కింద రాష్ట్ర వ్యాప్తంగా రూ.26 వేల కోట్లు పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఇస్తే, ఒక్క కుప్పంలోనే అక్షరాలా 44,888 మంది అక్కచెల్లెమ్మలకు రూ.172 కోట్లు ఇచ్చాం. గత ప్రభుత్వ హయాంలో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నావడ్డీ ఎగ్గొడితే…. మనందరి ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం కింద నా అక్కచెల్లెమ్మలకు మరో రూ.30 కోట్లు ఇచ్చింది. దీని వల్ల 6,055 సంఘాలకు మంచి జరిగిస్తూ 59,662 మంది అక్కచెల్లెమ్మలకు మరో రూ.30 కోట్లు ఇచ్చి తోడుగా నిలబడింది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే. జగనన్న అమ్మ ఒడి ద్వారా కుప్పం నియోజకవర్గంలో 35,951 మంది పిల్లలను బడికి పంపించే తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చినది అక్షరాలా రూ.155 కోట్లు. కుప్పంలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలో అందించిన ఇళ్ల పట్టాలు సున్నా. ఈ 57 నెలల కాలంలోనే కుప్పం నియోజకవర్గంలోనే అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ మొత్తం 30,755 ఇళ్ల పట్టాలు ఇవ్వగలుగుతున్నాం. చంద్ర బాబు హయాంలో కుప్పంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్లు కేవలం 3547 మాత్రమే. అందులో కట్టింది కేవలం 2,968 మాత్రమే. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాలా 7,898 ఇళ్లు మంజూరు చేసి వాటిలో ఇప్పటికే 4,871 ఇళ్లు పూర్తి చేశాం. చంద్రబాబు హయాంలో 45–60 సంవత్సరాల మధ్య వయసున్న అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత కోసం ఆయన చేసింది ఒక సున్నా. మీ బిడ్డ హయాంలో ఈ 45–60 సంవత్సరాల అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ వైయస్సార్ చేయూత ద్వారా కుప్పంలో ఏకంగా 19,921 మందికి మంచి చేస్తూ… వారి కుటుంబాల ఖాతాల్లోకి ఇప్పటికే రూ. 85 కోట్లు పంపించాం.
వైద్య, ఆరోగ్య రంగాన్ని చూస్తే…
చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ పేరు మార్చి నిర్వీర్యం చేసి ఎన్టీఆర్ వైద్య సేవ అని మార్చాడు. కుప్పంలో కేవలం 7002 మందికి అందించిన సాయం రూ.28 కోట్లు అయితే, మీ బిడ్డ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని మెరుగుపర్చి 1000 ప్రొసీజర్లను 3350కి తీసుకుపోయి విస్తరింపజేసి, ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ వీటి ద్వారా ఏకంగా కుప్పంలోనే 17,552 మందికి మంచి జరిగిస్తూ రూ.64 కోట్లు నేరుగా ఇచ్చాం.
బాబు హయాంలో అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ కింద కేవలం 8459 మందికి మాత్రమే రూ.27 కోట్లు.
అదే మనందరి ప్రభుత్వం ప్రభుత్వం 57 నెలల కాలంలోనే ప్రతి పిల్లాడికీ 100 శాతం పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ ఇస్తూ 12,093 మందికి విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా చెల్లించిన సొమ్ము అక్షరాలా రూ.61 కోట్లు.
35 ఏళ్లుగా బాబు – బీసీల సీటు కబ్జా చేశాడు…
అదే చంద్రగిరిలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసి పోటీ చేస్తే 1983లోనే ఏకంగా 17 వేల ఓట్లతో ప్రజలు ఓడగొట్టారు.
ఆ తర్వాత ఈ పెద్దమనిషి బీసీలు ఎక్కువగా ఉన్న ఇక్కడ, తన ధనబలం చూపిస్తూ ఈ నియోజకవర్గానికి వచ్చి బీసీల సీటు కబ్జా చేసి 35 ఏళ్లుగా రాజ్యం ఏలుతున్నాడు. ఆయన కనీసం ఇక్కడ ఒక ఇల్లయినా కట్టుకున్నాడా? ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కోసం మీతో పని కావాలి. కానీ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఆలోచన కూడా ఏరోజూ రాలేదంటే ఈ మనిషి మీ మీద చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి.
బాబు- కాపులకు వర్గశత్రువు.
పోనీ కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి? వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా.. అందుకే మిమ్మల్ని వారంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారని అడిగితే దానికి కూడా మాట్లాడడు. ఇదీ బాబు మార్క్ రాజకీయం. చంద్రబాబు మార్క్ రాజకీయం ఇది. వంచన, మోసం, కుట్ర, వెన్నుపోటు. కుప్పం ప్రజలకు కూడా మంచి చేశానని చెప్పే పరిస్థితి లేకపోవడం బాబు మార్క్ రాజకీయం అయితే, కుప్పంలో గత ఎన్నికల్లో బాబుమీద గెలవలేకపోయినా కూడా మీలో ఒకరిని, బలహీనవర్గాల ప్రతినిధిగా భరత్ ను ఎమ్మెల్సీగా చేసి, అతడిని ముందు పెట్టి ఇక్కడి పేద కుటుంబాలన్నింటికీ కూడా చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రతి కుటుంబానికీ మంచి చేయడం మీ జగన్ మార్క్ రాజకీయం అని చెప్పడానికి గర్వపడుతున్నాను.
57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం చూశారు. ప్రతి ఇంటికీ జరిగిన మంచి చూశారు. పేదవాడి భవిష్యత్ కోసం మీ బిడ్డ పడుతున్న తాపత్రయం మీరంతా చూశారు. మీ బిడ్డను మళ్లీ ముఖ్యమంత్రిగా మీరు చేసుకుంటే పేదవాడి బతుకు బాగుపడుతుంది. పేదవాడి భవిష్యత్ బాగుపడుతుందని సీఎం వైయస్ జగన్ తన ప్రసంగం ముగించారు.