ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు మరింత హీట్ గా మారుతున్నాయి. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇప్పటికే అనేక చోట్ల టికెట్లు ప్రకటించి సిద్దం సభలతో ప్రజల్లోకి దూసుకుపోతుంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం పొత్తుల ఉచ్చులో చిక్కుకుని కనీసం టికెట్లు కూడా ప్రకటించలేక దిక్కుతోచని స్థితిలో పడ్దారు. చంద్రబాబు వ్యవహార శైలితో రాన్నున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు సంగతి పక్కన పెడితే అసలు ఎన్నికలే చేయగలరా అనే అనుమానం రాజకీయ విశ్లేషకులు నుండి వస్తున్న మాట.
ఎన్నికలు సమీపిస్తున్నా ఇప్పటికీ టికెట్ల విషయం ఒక పట్టాన తేలకపోవడానికి ప్రధాన కారణం టీడీపీ జనసేన పొత్తు అనే భావన ఆ పార్టీ అభ్యర్దుల్లో బలంగా ఉంది. దీంతో ఆపార్టీ సీనియర్లలో ఇప్పుడు తమకి టికెట్ వస్తుందా లేక తమ స్థానాలను, చంద్రబాబు సర్వేల పేరుతో జనసేనకో , బీజేపీకో ప్రకటిస్తారా అనే ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది.
తెలుగుదేశం పార్టీలో సీనియర్లుగా చలామణి అవుతున్న ఆలపాటి, బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమా, సోమిరెడ్డి, పల్లె రఘునాథ రెడ్డి, బండారు సత్యానారాయణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప లాంటి వారు టికెట్లు వస్తాయా రావా అన్న ఆందోళన ఉన్నారు. చూడబోతే ఈ సీనియర్ల లిస్ట్ ఇంకా పెద్దగానే కనిపిస్తుంది. కుటుంబానికి ఒకటే టికెట్ అన్న సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ తెరమీదకి తీసుకురావడంతో జేసీ, పరిటాల రెండు కుటుంబాలలో రెండో టికెట్ సంగతి ఏంటనే ఆందోళన వారిలో పెరిగిపోతుంది. పైగా త్యాగాలు చేయాలని చంద్రబాబు పదే పదే చెప్పడంతో వీరిలో ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది.
బుచ్చయ్య చౌదరీ, జేసీ, ఉమా లాంటివారు ఇప్పటికే బయటపడి తమకి టికెట్ తెప్పించుకునేలా కార్యక్రమాలు చేస్తూ అధినేతపై ఒత్తిడి చేస్తుంటే మరికొందరు మాత్రం టికెట్ ఇవ్వలేని పక్షంలో కేశినేని నాని బాట పట్టేందుకు సిద్దమవుతున్నారు. అధికార వైసీపీలోని విజయసాయిరెడ్డి లాంటి వారితో టచ్ లోకి వెళ్ళేందుకు పావులు కదుపుతున్నారు. ఈ వ్యవహారం మొత్తం దగ్గరగా పరిశీలిస్తున్న క్యాడర్ టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సారి కూడా తమను పుట్టి ముంచేలాగే ఉన్నాడని తమ సన్నిహితుల దగ్గర వాపోతూ బాధని పంచుకోవడం గమనార్హం.