ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టడానికి టీడీపీ చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని టీడీపీ నాయకుల మీద పలు కేసులు నమోదయ్యాయి. స్వయంగా నారా భువనేశ్వరే మూడేసి లక్షల చొప్పున పంచడం, దానిపై కలెక్టర్ విచారణ చేపట్టడం మనకి తెలిసిందే.
చీరాల ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్ర వర్మ దగ్గర యాభై ఆరు లక్షల నగదు పట్టుబడింది. ఎన్నికల కోడ్ ప్రకారం యాభై వేల రూపాయల కన్నా ఎక్కువ నగదు ఎవరి వద్దా ఉండరాదు. అందుకై ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోనుంది.
ఇదిలా ఉండగా, గుంటూరు జిల్లాలో మరొక టీడీపీ నాయకుని బాగోతం బయటపడింది. ఎన్నికల కోసమై ఓటర్లకు తాయిలాలు ఇచ్చి ఆకట్టుకునేందుకు, పొన్నూరు నియోజకవర్గంలో దాచి ఉంచిన అయిదొందలు పై చిలుకు సైకిళ్ళు పట్టుబడ్డాయి. స్థానిక ఓటర్లను ప్రలోభపెట్టేందుకు, వారి పిల్లలకి పంచి పెట్టడం కోసం ఒక రైస్ మిల్లులో రహస్యంగా దాచి ఉంచిన సైకిళ్ళు పట్టుబడ్డాయి.
అయితే ఈ సైకిళ్ళు అన్నిటికీ టీడీపీ జెండాలు ఉండి, ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ నరేంద్ర స్టిక్కర్లు అంటించి ఉండటం విశేషం. పైగా ఈ సైకిళ్ళు దొరికిన రైసుమిల్లు ధూళిపాళ స్వగ్రామం చింతపల్లి కావడం మరొక విశేషం. ఈ సైకిళ్ళ విషయమై గుర్తు తెలియని వ్యక్తి అధికారులకు ఫోన్ చేయడంతో రంగంలోకి దిగిన అధికారులు వీటిని గుర్తించి సీజ్ చేసారు. ఆపై కేసు నమోదు చేసారు.