ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే,.విశాఖపట్నాన్ని ఎలా తీర్చిదిద్దాలి? రాష్ట్రానికి విశాఖపట్నం ఎందుకు అవసరం అన్న అంశాలపై మనం చర్చించాల్సిన అవసరం ఉంది.రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. దేశంమొత్తం చూసుకుంటే జీఎస్డీపీలో వ్యవసాయం వాటా 17–18 శాతంగా ఉంది. మన రాష్ట్రంలో అయితే ఇది 35శాతంగా ఉంది.ద్వితీయ, తృతీయ రంగాలు వృద్ధి్ చెందకపోతే రాష్ట్రం కూడా ఆర్ధికంగా నిలబడలేదు. ప్రాథమిక రంగమైన వ్యవసాయరంగంతో పోలిస్తే ద్వితీయ రంగం, తృతీయ రంగాలు శరవేంగా వృద్ధిచెందాల్సిన అవసరం ఉంది.అప్పుడు మాత్రమే ముందున్న సవాళ్లను అధిగమించగలం. అప్పుడే మనం ఆశించిన ఆర్థికాభివృద్ధిని సాధించగలం.
రాష్ట్ర విభజన వల్ల పెనుసవాళ్లు మనకు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని కోల్పోయాం. దీనివల్ల రాష్ట్రంమీద పెను ప్రభావం పడింది. ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా పురోగమించాలంటే ఒక చోదకశక్తి అవసరం. ఉమ్మడి రాష్ట్రంలో అలాంటి ఆర్థిక చోదకశక్తి అయిన హైదరాబాద్ను మనం కోల్పోయాం.ఆర్థిక ప్రగతి లక్ష్యాలను చేరుకోవడానికి ఒక వాహనం మాదిరిగా ప్రభుత్వ రంగ సంస్థలను భావించి.. ఆరోజుల్లో కేంద్ర ప్రభుత్వం వాటిని విరివిగా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఐడీపీఎల్, ఎన్ఎండీసీ, ఎన్ఎఫ్సీ, ఐఐసీటీ లాంటి సంస్థలు హైదరాబాద్లో స్థాపించబడ్డాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు హైదరాబాద్కు వచ్చాయి. దీంతో ఉమ్మడి రాష్ట్రంలోని ఏ ఇతర ప్రాంతంతో పోల్చుకున్నా హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందింది. ఇలాంటి సంస్థలు వస్తే గనుక వెంటనే అభివృద్ధి పరంగా మంచి మార్పు కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో మంచి జీతాలు లభిస్తున్న ఉద్యోగులు ఉంటారు. ఇది వలయంలా మారి మంచి సంస్థలు రావడం, తద్వారా మంచి ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. తద్వారా నగరం బాగా విస్తరిస్తుంది.ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన ప్రభుత్వరంగ సంస్థల్లో 90శాతం సంస్థలు కేవలం హైదరాబాద్లోనే స్థాపించబడ్డాయి. దీనివల్ల ఉమ్మడి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందింది. దురదృష్టవశాత్తూ ఉమ్మడి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అలా జరగలేదు.
ఆర్థిక రంగాన్ని ముందుకు నడిపే సేవారంగం జాతీయ స్థాయిలో చూస్తే జీఎస్డీపీలో 55 శాతంకాగా, కానీ తెలంగాణలో సేవా రంగం దాదాపు 62.87శాతంగా ఉంది. కాని మన రాష్ట్రంలో సేవారంగం వాటా కేవలం 40శాతం మాత్రమే. తెలంగాణలో సేవారంగానికి సంబంధించి అత్యధిక వాటా హైదరాబాద్నుంచే వస్తోంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రావాల్సి ఉంది.అప్పుడే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ పెరుగుతుంది. తయారీ రంగంలో జాతీయ స్థాయితో పోలిస్తే జీఎస్డీపీలో సమాన స్థాయిలో ఉన్నప్పటికీ సేవా రంగం విషయంలో గణనీయ ప్రగతి చోటుచేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయరంగంతో పోలిస్తే సేవారంగంలో మంచి వృద్ధిరేటు సాధ్యం అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. సర్వీసు రంగం బాగా పెరగాల్సిన అవసరం ఏ రాష్ట్రానికైనా ఉంది.
2022–23 ఆర్థిక సంవత్సరంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం కేవలం రూ.2,19,518కాగా, తెలంగాణలో తలసరి ఆదాయం రూ. 3,12,398లు. తెలంగాణ తలసరి ఆదాయంలో అత్యధిక భాగం హైదరాబాద్ నుంచే వస్తోంది. సహజ సిద్ధంగా మనకున్న బలాలను వినియోగించుకుంటూ ఆర్థిక పురోగతిలో ముందుకుసాగాల్సిన అవసరం ఉంది. దేశంలోనే రెండో అతిపెద్ద సముద్రతీర ప్రాంతం మనకు ఉంది. 974 కి.మీ పొడవైన తీర ప్రాంతం కారణంగా పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మనకపార అవకాశాలున్నాయి. దీనివల్ల తయారీ రంగానికి కూడా గట్టి ఊతం లభిస్తుంది. పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా తయారీ రంగానికి తగిన సహకారాన్ని అందిస్తూ,974 కి.మీ. తీరంవెంబడి వివిధ పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసుకుంటూ, మరోవైపు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఈ రెండూ కలిసి రాష్ట్రానికి మంచి ఆర్థిక ప్రగతిని అందిస్తాయి.
2019కు ముందు కేవలం 4 చోట్ల నుంచే ఎగుమతులు జరిగేవి. కాని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మరో నాలుగు పోర్టులు కడుతున్నాం. వీటి పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. దాదాపు రూ.16వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. ఇప్పటికే దాదాపుగా రూ.4వేల కోట్లు ఖర్చుచేశాం. రామాయపట్నం పోర్టులో వచ్చే నెలలోనే షిప్పులు వచ్చే పరిస్థితి నెలకొందని అధికారులు చెప్తున్నారు. మచిలీపట్నం, కాకినాడలోని ప్రయివేటు పోర్టు, మూలపేట పోర్టులవద్ద కూడా పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. నాలుగులో మూడు పోర్టులు ప్రభుత్వ రంగంలో వస్తుండగా, మరో పోర్టు ప్రయివేటు రంగంలో వస్తోంది. బ్లూ ఎకనామీకి ఊతమిచ్చేలా 10 పిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. తీరం వెంబడి ప్రయాణిస్తే ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఒక ఫిషింగా హార్బర్ ఉంటుంది. అలాగే 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీటితోపాటు పారిశ్రామిక నోడ్స్ను అభివృద్ధి చేస్తూ కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ను నెలకొల్పాం. అచ్యుతాపురం, ఓర్వకల్లు, కృష్ణపట్నంలలో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నాం. అలాగే రాష్ట్రమంతటా కూడా సమతుల్య అభివృద్ది ఉండేలా చూస్తున్నాం.
ప్రభుత్వం తీసుకుంటున్న సానుకూల చర్యల వల్ల, వ్యాపార అనుకూల వాతావరణం వల్ల గడచిన మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. పారిశ్రామిక వేత్తలకు, పారిశ్రామిక రంగాన్ని రాష్ట్రం ఎంత స్నేహపూర్వకమైనదో చెప్పడానికి ఇదే ఉదాహరణ.గత ఏడాది ఇదే విశాఖట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంగా రూ.13 లక్షల కోట్లకుపైగా విలువైన 352 ఒప్పందాలు కుదిరాయి.దాదాపు 6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇందులో 39 శాతం ఒప్పందాలు ప్లాంట్ల ఏర్పాటు ద్వారా ఇప్పటికే కార్యరూపంలోకి వచ్చాయి. మిగిలిన ఒప్పందాలు కూడా శరవేగంగా అమల్లోకి వస్తున్నాయి.
కేవలం అతి పెద్ద తయారీ పరిశ్రమలు రావడంద్వారానే ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదు. గడచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి, లబ్ధిదారులను సుస్థిర స్వయం ఉపాధి మార్గాలవైపు నడిపించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు గణనీయమైన మార్పును తీసుకు వచ్చాయి. లంచాలకు తావులేకుండా, దళారీలు లేకుండా అవినీతి లేకుండా అత్యంత పారదర్శకంగా పథకాలు డీబీటీ పద్ధతిలో అమలు చేసింది. ప్రతి సంక్షేమ పథకం కూడా లబ్ధిదారులను చేయిపట్టుకుని నడిపించాయి. ఉదాహరణకు చేయూత పథకాన్ని తీసుకుంటే క్రమం తప్పకుండా ఒకే మహిళకు రూ.18,750లు చొప్పున నాలుగేళ్లపాటు స్థిరంగా ఇచ్చాం. ఆ లబ్ధిదారులైన మహిళలను బ్యాంకులతో అనుసంధానం చేశాం. అమూల్, ఐటీసీ, రియలన్స్, పీ అండ్ జీ లాంటి పెద్ద కంపెనీల భాగస్వామ్యంతో వారికి స్వయం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేశాం. వాల్లకాళ్లమీద వాళ్లు నిలబడేలా చేశాం. రాష్ట్రం ప్రభుత్వం ఈ ఐదేళ్లలో అమలు చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఇలాగే అమలు చేసింది. ఇదివరకు జీవనోపాథి పొందుతున్న మార్గాన్ని బలోపేతం చేయడమో లేక కొత్త ఉపాథి మార్గాన్ని సృష్టించడమో జరిగింది.
ఉద్యోగ రంగాన్ని మొత్తం చూస్తే.. ప్రభుత్వంలో ఉన్నవి కొన్ని మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. మేం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యగుల సంఖ్య 4లక్షలు అయితే, మేం వచ్చిన తర్వాత సుమారో మరో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగులను జోడించగలిగాం. దశాబ్దాలపాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగుల సంఖ్య 4 లక్షలు అయితే, 50శాతం అధికంగా కొత్త ఉద్యోగాలను మేం అధికారంలోకి వచ్చాక సృష్టించగలిగాం. అలాగే భారీ పరిశ్రమల విషయంలో కూడా కోట్లాది రూపాయల పెట్టుబడులను పెడితే, ఆ పెట్టుబడులు ఉద్యోగావకాశాల రూపంలో మారేది కూడా స్వల్పంగానే ఉంటుంది. కాని, ఉద్యోగ ఉపాధి రంగాల్లో పెద్ద వాటా వ్యవసాయం సహా ఇతర మూడు రంగాల్లో ఉన్నాయి.
వ్యవసాయరంగంపై 62శాతం మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. 52 శాతం మంది రైతులకున్న భూమి అర హెక్టారు లోపలే. 70 శాతం మంది రైతులకున్న భూమి హెక్టారు లోపలే. అభివృద్ధిగురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ వాస్తవ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మనకు పెద్ద మొత్తంలో సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. వీరు ఆదాయాలు పొందలేకపోతే ఆర్థిక వ్యవస్థ కూప్పకూలిపోతుంది. అందుకే రైతులకు చేయూనిచ్చి నడిపించడానికి, ఆర్బీకేల ద్వారా, అగ్రికల్చరల్ అసిస్టెంట్లను పెట్టడం ద్వారా, రైతు భరోసా ద్వారా వారికి తోడుగా నిలుస్తున్నాం. ఉపాథి రంగంలో వ్యవసాయానిది ప్రముఖ పాత్ర.
ఇక మరో కీలక రంగం ఎంఎస్ఎంఈలు. అతి భారీ, భారీ పరిశ్రమల వల్ల కేవలం 3–4 లక్షల ఉద్యోగాలు ఉన్నాయనుకుంటే ఎంఎస్ఎంఈల్లో 30 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంఎస్ఎంఈల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరుగుతుంది.వీటన్నింటికంటే ఎక్కడు మంది స్వయం ఉపాధి మార్గాల ద్వారా జీవిస్తున్నారు. 1.5 కోట్ల మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేం వెనుక వీరి పాత్రే కీలకం. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా వీరికి చేదోడుగా నిలుస్తోంది. వారి స్వయం ఉపాధికి సహకారాన్ని అందిస్తోంది. ఉదాహరణకు చూసుకుంటే రాష్ట్రంలో కోటిమందికిపైగా మహిళలు స్వయం సహాయ సంఘాల్లో ఉన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్వయం సహాయక సంఘాల రుణ బకాయిలు, ఎన్పీఏలు 80శాతం వరకూ ఉండేవి. ఇప్పుడు కేవలం 0.3శాతం మాత్రమే ఉన్నాయి. కోటిమంది మహిళలు దీనిపై ఆధారపడి ఉన్నారు. అలాగే కార్లు, వాహనాలు నడుపుతూ బతుకుతున్న వారిని వాహనమిత్ర ద్వారా చేదోడుగా నిలుస్తున్నాం. అలాగే కులవృత్తులు చేసుకుంటున్న నాయీబ్రాహ్మణులు, రజకులు, టైలర్లు వంటి వారికి కూడా ప్రభుత్వం చేదోడుగా నిలిచింది. ఆర్థికాభివృధ్ధిలో వీరందరిదీ కీలక పాత్ర. రాష్ట్రంలో ఇలా ప్రతి వర్గానికి కూడా చేయూత నందించేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. కోవిడ్ లాంటి సంక్షోభ సమయంలో కూడా ఎంఎస్ఎంఈలకు సకాలంలో ప్రోత్సాహకాలను విడుదలచేసి ప్రభుత్వం వారిని ఆదుకుంది. ఇది ఎంఎస్ఎంఈల రంగాన్ని రక్షించింది. అందుకే ఈ రంగంలో వృద్ధి గతంతో పోలిస్తే గణనీయంగా ఉంది. 2018–19లో ఆర్థిక వృద్ధిరేటులో రాష్ట్రం చివరల్లో ఉంటే గత ఏడాది మొదటి ఐదు రాష్ట్రాల్లో నిలవడం దీనికి నిదర్శనం. భారత్లో తయారీ రంగం జీవీఏలో రాష్ట్ర తయారీ రంగం జీవీఏ 2019–24 మధ్య 4శాతంగా ఉంటే, 2014–19 మధ్య కేవలం 2.9శాతం మాత్రంగా ఉండడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.
మరి ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శరవేగంగా ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న దానిపై ఇప్పుడు మనం ఆలోచన చేయాలి? వైజాగ్ విషయంలో మనం ఏం చేయాలి? వైజాగ్అభివృద్ధి చరిత్రను మనం ఏరకంగా మార్చాలి? వచ్చే పదేళ్లలోగా మనం హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు లాంటి మహా నగరాలతో ఎలా పోటీపడాలి? అన్నదానిపై మనం దృష్టిపెట్టాలి. ఇదే విజన్ విశాఖకు అర్ధం, పరమార్థం కావాలి. ఈ ప్రాంతం పట్ల ఈ నగరం పట్ల అభిరుచి, అంకిత భావం, చిత్తశుద్ధి లేకపోతే ఈ విజన్అన్నది సాకారం కాదు, వాస్తవంలోకి రాదు. అన్నికంటే ముందు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నేను ఇక్కడకు వచ్చి నివాసం ఉండాలి. ఆది నేను అనగానే, మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు, సొంత ప్రయోజనాలు ఉన్న నెగెటివ్ మీడియా ఒక్కసారిగా బోరున విలపిస్తాయన్న సంగతి మీ అందరికీ తెలిసిందే.వైజాగ్కు మారుస్తాన్నామంటే చాలు, ఇక్కడ భూముల కబ్జాచేయడానికి వస్తున్నారనీ, అది చేస్తున్నారనీ, ఇది చేస్తున్నారనే రక రకాల కథనాలు ప్రచురిస్తున్నారు, ప్రసారంచేస్తున్నారు.సిగ్గులేకుండా ఇలాంటి రాతలు రాస్తున్నారు. సిగ్గులేకుండా చూపిస్తున్నారు. కోర్టులకు వెళ్తున్నారు. కేసులు వేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వాళ్లు చేస్తున్నారంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి విశాఖపట్నం రాకూడదు.
ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇక్కడకు వస్తే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పురోగతి సాధిస్తుంది. అందుకే సీఎం ఇక్కడకు రాకూదని అనుకుంటున్నాకు. దీనివెనుక మరోచోట వారికి స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. అక్కడ రాజధాని ప్రకటనకు ముందే వేలాది ఎకరాలు భూమిని కొనుగోలు చేశారు. బినామీల పేర్లతో భూములు కొన్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనగానే ఈ భూముల కొన్నవారంతా అక్కడ వారి భూముల రేట్లు తదుపరి పడిపోతాయని ఒక్కసారిగా భీతిల్లిపోయారు. వారి స్వప్రయోజనాల కారణంగా వైజాగ్ సందిగ్ధంలోకి వెళ్లాల్సి వచ్చింది.నేను ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. మార్పులు అనేవి అనివార్యం. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులతో పోటీపడాలంటే వైజాగ్ అనేది ఎకనామిక్ ఇంజిన్– ఆర్థిక చోదకశక్తి కావాల్సిందే.
నాకేమైనా స్వప్రయోజనం ఉంటే నేను కడప గురించి మాట్లాడేవాడిని.రాష్ట్రం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిదీ అనేది నా అభిప్రాయం.భవిష్యత్తు తరాలకు ఏది చేస్తే మంచిది, మన పిల్లలకు ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయడం వల్ల రాష్ట్ర ఆదాయాలు పెరుగుతాయి, దేని వల్ల ఆర్థికంగా పురోగమిస్తాం, అనేరకంగా మనం ఆలోచన చేయకపోతే, ఈ కోణంలో మనం వైజాగ్ను మనం ఆలోచించలేకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? అన్నది మనం అంతా ప్రశ్నించుకోవాలి.
నాయకుడి దార్శినికత తప్పు అయితే… నాయకుడి దార్శినికత నెగెటివ్ అయితే…వైజాగ్ వృద్ధిచెందదు, విస్తరించదు. దురదృష్టవశాత్తూ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం కోసం ఎవరైనా నిలబడ్డారంటే.. అది నేను మాత్రమే. ఇది వాస్తవం. విశాఖపట్నంకోసం ప్రతిపక్షాలతోనూ, స్వప్రయోజనాలున్న మీడియాతోనూ పోరాడుతున్నాం. వారిలో ప్రతి ఒక్కరూ కూడా విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని కాకూడదని కోరుకుంటున్నారనేది వాస్తవం.
వైజాగ్ తప్పనిసరిగా అభివృద్ధి చెందాలి.ఒకవైపు కోర్టు కేసులు నడుస్తున్నాయి,మరోవైపు విశాఖపట్నాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నప్పటికీ ఎన్నికలు ముగిసిన తర్వాత నేను విశాఖలోనే నివాసం ఉంటాను. నా ప్రమాణస్వీకారోత్సవం కూడా విశాఖలోనే జరుగుతుందని స్పష్టం చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి