ఏపీలో ఎన్నికల రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది. అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా జగన్ వర్సెస్ ఎన్డీఏ కూటమి వ్యూహాలతో బరిలోకి దిగారు. ఇప్పటికే జగన్, చంద్రబాబు, పవన్ ప్రచారం ప్రారంభించారు. తాను అమలు చేసిన సంక్షేమం – సామాజిక న్యాయం తనను గెలిపిస్తాయని జగన్ నమ్ముకున్నారు. జగన్ పైన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కూటమి విశ్వసిస్తోంది. కానీ కూటమి అనుకున్నంత వ్యతిరేకత జగన్ పైన లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎన్నికల మేనిఫెస్టో 2019 ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేసామని జగన్ చెబుతున్నారు. ఇచ్చిన ప్రతీ హామీ నిలబెట్టుకున్నామని ప్రతీ సభలో వివరిస్తున్నారు. ఈ సారి మేనిఫెస్టోలో తాము అమలు చేసే అంశాలనే ప్రస్తావిస్తామని జగన్ ఇప్పటికే స్పష్టం చేసారు. ఏప్రిల్ 9 ఉగాది నాడు మేనిఫెస్టో ప్రకటనకు జగన్ ముహూర్తంగా నిర్ణయించారు. చెప్పామంటే చేస్తామంతే అనే నమ్మకంతో తాము ఇచ్చిన ప్రతీ హామీ అమలవుతుందని జగన్ స్పష్టం చేసారు. అయితే, తాను అమలు చేసిన పథకాల లబ్దిదారులే తన ఓటర్లుగా జగన్ విశ్వసిస్తున్నారు. ఈ సారి మేనిఫెస్టోలో ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకు కొన్ని మార్పులు చేయటంతో పాటుగా కొత్త వరాలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు.
జగన్ కసరత్తు ప్రస్తుతం అమలు చేస్తున్న అమ్మఒడి పథకం కుటుంబలో ఒక్క విద్యార్దికే అందుతోంది. దీనిని ఇద్దరి వరకు పెంచే అవకాశం ఉందని సమాచారం. అదే విధంగా పెన్షన్ ను రూ 3 వేల నుంచి రూ 4 వేల వరకు విడతల వారీగా పెంచేలా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. యువత, మహిళలకు ఆర్దికంగా తోడ్పాటు అందించేలా కొత్త వరాలు ఉంటాయని పార్టీలో చర్చ సాగుతోంది. 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ అమలు చేసారు. ఈ సారి డ్వాక్రా మహిళలకు జగన్ ఎలాంటి వరాలు ఇవ్వబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. దాదాపు కోటి మంది డ్వాక్రా మహిళలు ఉండటంతో ఈ ఓట్ బ్యాంక్ కీలకం కానుంది. అటు చంద్రబాబు అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఎన్నికల హామీలను కాపీ కొట్టి సూపర్ సిక్స్ తో ముందుకు వస్తున్న జనాలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. 2014లో 650 హామీలు ఇచ్చి ఒక్క శాతం కూడా అమలు చేయలేకపోవడంతో జనాలు ఎవరు నమ్మడం లేదు, పైగా 2014లో బిజెపి జనసేనతో జతకట్టిన బాబు ఎన్డీఏ కూటమి రాష్ట్రానికి ప్రకటించిన ఏ యొక్క హామీని నిలబెట్టుకోలేకపోయింది. ఇచ్చిన హామీలు తీసుకురావడంలో చంద్రబాబు విఫలమవడంతో ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు.