సిద్ధం.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల సభల పేరు ఇది. దీనికి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. నాలుగో సభ ఈ ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరుగుతుంది. ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడు సభలు విజయవంతమైన విషయం తెలిసిందే. తాజా సభకు పి.గుడిపాడు వేదికైంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 44 నియోజకవర్గాల నుంచి సుమారు 15 లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. వీరి కోసం వందల ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. సభ ప్రారంభానికి గంటల ముందే జనం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రాంగణానికి వెల్లువలా చేరుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నియోజకవర్గాల నుంచి ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్తున్నారు. మేదరమెట్ల మొత్తం జై జగన్ నినాదాలతో మారుమోగుతోంది. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా వాహనాలను దారి మళ్లించారు. వై నాట్ 175 కాన్సెప్ట్తో వై ఆకారంలో నిర్మించిన ర్యాంప్ ఆకట్టుకుంటోంది.
తెలుగుదేశం – జనసేన – బీజేపీ పొత్తు అధికారికంగా ఖారారయ్యాక జరుగుతున్న సభ ఇది. దీంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత సభల్లో ఆయన చంద్రబాబు నాయుడిని చంద్రముఖితో పోల్చారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి దానిని తరిమేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికీ వెళ్లి మంచి జరిగి ఉంటే అండగా నిలబడాలని కోరాలని కార్యకర్తలకు సూచించిన విషయం తెలిసిందే. ముగ్గురు కలిసి వస్తున్న నేపథ్యంలో ఈసారి స్పీచ్ అదిరిపోతుందని వైఎస్సార్సీపీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. జనాన్నే నమ్ముకున్న జగన్ ప్రత్యర్థి పార్టీలపై కౌంటర్లు వేస్తారని భావిస్తున్నారు. తమ అధినేత మాస్ స్పీచ్ కోసం లక్షలాది మంది కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఇక ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం నాలుగో సభ ఫొటోలతో నిండిపోయింది. జగన్ ప్రసంగం మొదలయ్యాక ఎక్కడ చూసినా అవే పోస్టులు దర్శనమివ్వనున్నాయి.