‘అతను పోతే నాకేం నష్టం లేదు. వంద మంది లీడర్లను తయారు చేస్తా.. 40 ఇయర్స్ ఇండస్ట్రి ఇక్కడ..’ ఎవరైనా పార్టీని వీడితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చెప్పే మాటలివి. కానీ ఆయన ఇప్పటి వరకు చేసిందేమీ లేదు. లీడర్లను తయారు చేసే సత్తా ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉంది. ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో చేరి ఎదిగిన వారే ఇప్పటికీ బాబు వద్ద ఉన్నారు. ఆ వృద్ధులే అక్కడ లీడర్లు. ఇతర పార్టీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలై ఏదో టైం బాగోలేక నారా వారి వద్ద చేరిన కొందరు నాయకులున్నారు. అంతే తప్ప చంద్రబాబు ఎప్పుడూ లీడర్లను తయారు చేయలేదు. వాస్తవానికి ఆయన తన హయాంలో సొంత కులానికి చెందిన పలువురికి మాత్రం అవకాశాలు కల్పించారు. అది కూడా ప్రజల సొమ్మును దోచుకోవడం కోసమే..
జగన్ ఆశీస్సులతో..
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలో ఉండగా ఎందరో లీడర్లుగా ఎదిగారు. 2014, 19 ఎన్నికల్లో సామాన్యులు, వెనుకబడిన తరగతులకు చెందిన వారికి అవకాశాలు కల్పించి చట్టసభలకు తీసుకెళ్లారు. స్థానిక సంస్థల్లోనూ ఇదే పరిస్థితి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వలంటీర్గా ఉన్న ఎస్టీ మహిళ మున్సిపాలిటీ చైర్పర్సన్ అయ్యారు. ఆ ఊరిలో వెల్డింగ్ పని చేసుకునే జగన్ అభిమాని వైస్ చైర్మన్ అయ్యాడు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ ఒకప్పుడు కార్పొరేటర్గా చేసిన వ్యక్తే. ఆయన్ను వైఎస్సార్సీపీ అధినేత రెండుసార్లు ఎమ్మెల్యేను చేశారు. మంత్రి పదవి కట్టబెట్టారు. ఇప్పుడు ఎంపీ స్థానం కేటాయించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన కిలివేటి సంజీవయ్య ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి.
జగన్ ఆలోచనలు ప్రతిపక్షాల ఊహలకు కూడా అందవు. అంబేడ్కర్ ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని పేదలను రాజకీయాల్లో అందలమెక్కించిన ఘనత ఆయనది. అవకాశాలు రాక పాలిటిక్స్కు దూరంగా ఉన్న సామాజిక వర్గాలను ఉన్నత స్థానంలో కూర్చొబెట్టారు. శనివారం విడుదల చేసిన జాబితాలో ఐదు కొత్త ముఖాలున్నాయి. రాజమండ్రి, నర్సాపురం ఎంపీ స్థానాలను డాక్టర్, లాయర్కు కేటాయించారు. అది కూడా బీసీ వర్గానికి చెందిన వారికి. మైలవరం సీటును యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అతను ప్రస్తుతం జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నారు. నెల్లూరు సిటీని ముస్లింలకు ఇచ్చారు. ఎంపిక చేసిన వ్యక్తి 2021లో డిప్యూటీ మేయర్ అయ్యారు. తమకు పెద్ద అవకాశాలు వస్తాయని వాళ్లిద్దరూ కలలో కూడి ఊహించి ఉండరు. అయితే లీడర్లను తయారు చేసే క్రమంలో జగన్ ఈ సామాన్యులను ఎంపిక చేశారు.
చంద్రబాబూ నువ్వు చేయగలవా..
జగన్లా సామాన్యులకు టికెట్లు కేటాయించే పని చంద్రబాబు ఎప్పటికీ చేయలేరు. ఇది నూటికి నూరు శాతం నిజం. ఆయనకు డబ్బున్న అభ్యర్థులే కావాలి. అది కూడా అగ్రవర్ణాలై ఉండాలి. లేకపోతే పట్టించుకోడు. జనరల్ స్థానాల్లో వెనుకబడిన వర్గాలకు అవకాశం ఇచ్చిన వ్యక్తి జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓట్ల కోసం వాడుకున్న వ్యక్తి చంద్రబాబు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఓ సందర్భంలో మీ జీవితాలను నా చేతుల్లో పెట్టండి లీడర్లుగా తయారు చేస్తానని కార్యకర్తలతో అన్నాడు. కానీ బాబుని ఒప్పించి తన పార్టీలోని ఒక్క సామాన్యుడికి కూడా టికెట్ ఇప్పించలేడు. ఇది ముమ్మాటికీ నిజం. ప్రస్తుతం సేన నాయకులు వైఎస్సార్సీపీని చూపించి అక్కడిలా మన పార్టీలోని సామాన్యులకు అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. అయితే పవన్ దిక్కులు చూస్తూ నా చేతుల్లో ఏమి లేదు. టీడీపీ ఏం చెబితే అది చేయాలని బయటకు చెప్పలేక నవ్వుతూ పక్కకి తప్పుకొంటున్నారు. తెలుగుదేశంలో ఉన్న డబ్బున్న వ్యక్తులను సేనలోకి పంపి టికెట్లు ఇచ్చి పోటీ చేయించాలనేది బాబు ప్లాన్. జగన్ ఇంకా వందకు పైగా అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీరిలో చాలామంది సామాన్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.
– వీకే..