చిన్న వయసులో వినికిడి సమస్య ఉంటే ఆ బాధ వర్ణనాతీతం అని చెప్పొచ్చు.. బాల్యంలో వినికిడి సమస్య ఏర్పడితే మాట్లాడటం కూడా కష్టం అవుతుంది. ఆయా పదాలను వినడం వల్లనే వాటిని నేర్చుకుని మనిషి మాట్లాడతాడు. కానీ చిన్న వయసులో ఏర్పడిన వినికిడి సమస్యను పరిష్కరించకపోతే జీవితాంతం ఆ సమస్య ఉన్న వ్యక్తి వినలేక మాటలు రాక ఇబ్బంది పడతాడు. తాజాగా ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ చేయించుకుని వినగలగుతున్న ఓ చిన్నారి తండ్రి ముఖ్యమంత్రి జగన్ ని కలిసి తన కృతజ్ఞతలు తెలియజేసారు.
సీఎం జగన్ ప్రస్తుతం మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత 22 రోజులుగా కొనసాగుతున్న బస్సుయాత్ర శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నుంచి ప్రారంభం అయింది. కాగా అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన చమల్ల శ్రీధర్ కలిశారు.
ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ ద్వారా తన కుటుంబం పొందిన లబ్దిని సీఎం జగన్ కి చమల్ల శ్రీధర్ తెలియజేసి కృతజ్ఞతలు తెలియజేసారు. తనకు వినికిడి సమస్య ఉన్న త్రిషాన్ అనే కుమారుడు ఉన్నాడని, కానీ వినికిడి సమస్య ఉండడం వల్ల మాటలు కూడా వచ్చేవి కావని దీంతో తాము కృంగిపోయామని వెల్లడించారు. ఖరీదైన చికిత్స కావడంతో ఎలా చికిత్స చేయించాలో తెలియక ఇబ్బంది పడుతున్న తమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ఆపద్భాంధవిలా కనిపించిందని శ్రీధర్ తెలిపారు.
2022 జూలై 18న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తన కుమారుడికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ జరిగిందని, కాక్లియర్ ఇంప్లాంట్ తర్వాత తన కుమారుడు త్రిషాన్ వినగలుగుతున్నాడని.. చిన్న చిన్న పదాలు కూడా పలుకుతున్నాడని చమల్ల శ్రీధర్ ఆనందంగా సీఎం జగన్ కి వెల్లడించారు. సంక్షేమ పథకాలతో ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం జగన్ తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని శ్రీధర్ స్పష్టం చేశారు.