షర్మిల సునీత తీరుపై వైయస్సార్ చెల్లెలు వైయస్ విమలమ్మ మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ అక్క చెల్లెలు ఇద్దరు కలిపి వైయస్ కుటుంబం పరువుని బజారుకీడుస్తున్నారని వాపోయారు. ఇంటి ఆడపడుచులు ఇలా ఇంటి గౌరవాన్ని రోడ్డుకి ఈడ్చడం ఏమాత్రం బాగాలేదని, కుటుంబం పట్ల వాళ్లు మాట్లాడుతున్న మాటలు భరించలేకపోతున్నానని తెలిపారు. నేనూ ఆ ఇంటి ఆడపడుచుగానే మాట్లాడుతున్నా. షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియో చూసాను. షర్మిలకు లీడర్ షిప్ క్వాలిటీ లేదు. మాటకు ముందు రాజశేఖర్ రెడ్డి బిడ్డని మాటకు తర్వాత రాజశేఖర్ రెడ్డి బిడ్డని అని షర్మిల అంటోంది. కానీ లీడర్షిప్ క్వాలిటీ మాత్రం షర్మిలకు రాలేదు అని విమలమ్మ మీడియాతో అన్నారు.
అనునిత్యం షర్మిల అవినాష్ను విమర్శిస్తున్నారు. అవినాష్ హత్య చేయడం ఆ ఆడపిల్లలిద్దరూ చూశారా?. సీఎం జగన్ను కూడా దీంట్లోకి లాగుతున్నారు. వాళ్లే(షర్మిల, సునీతలు) డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకు?. హత్య చేసినవాడు బయట తిరుగుతున్నాడు. అతను చెప్పిన మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా?..
ఏ పాపం చేయని నా సోదరుడు భాస్కర్ రెడ్డి ఏడాదిగా జైల్లో ఉన్నాడు. అవినాష్ బెయిల్ రద్దు చేయమని షర్మిల, సునీత పోరాడుతున్నారు. హత్య చేసిన వాడు సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మా ఇంట్లో పిల్లలు ఇలా తయారవడం చాలా బాధగా ఉంది. శత్రువులంతా ఒక్కటైనపుడు కుటుంబసభ్యుడికి తోడుగా ఉండాలి.
వివేకం అన్న అంటే షర్మిల, సునీత కంటే నాకే ఎక్కువ ఇష్టం.
వివేకం అన్న పై ఇంత ప్రేమ చూపిస్తున్న షర్మిల సునీతలు అన్న చనిపోక పదేళ్ల ముందు సునీత దూరం పెడితే షర్మిల ఆరోజు సునీతని ఎందుకు ప్రశ్నించలేదు దూరం పెట్టావని అని అడిగారు. కనీసం ఆయన బాగోగులు కూడా పట్టించుకోలేని పరిస్థితికి సునీత వెళ్ళిపోయింది నేడు మాత్రం కపట ప్రేమ చూపిస్తోంది అని అనింది. షర్మిల, సునీత వల్ల కుటుంబసభ్యులంతా ఏడుస్తున్నారు. వైయస్ జగన్ పై వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు కక్ష పెట్టుకున్నారో కుటుంబ సభ్యులైన మాకు కూడా అర్థం కావడం లేదు.
గతంలో వైయస్ఆర్ ని ఇబ్బందులు పెట్టినవారు ఇప్పుడు షర్మిలతో ఉన్నారు. ఇటీవల జరిగిన వివేకం అన్న వర్ధంతి రోజు ముఖ్య ఆహ్వానితులుగా ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ఉన్నారు. మొదట వివేకానంద రెడ్డి హత్యలో ముద్దాయిలుగా భావించినవారు. అలాంటి వారితోనే షర్మిల సునీత జతకట్టారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు.
ప్రశాంతంగా ఉన్న పులివెందుల ప్రాంతంలో అల్లర్లు రేపుతున్నారు. మీరు చేస్తున్న పనుల వల్ల వైయస్ కుటుంబ సభ్యులు ఎవరూ హర్షించట్లేదు. మీరు చేసే పనుల పట్ల వైయస్ఆర్ కూడా సంతోషంగా లేరు.
పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడడం తప్పు. అంతిమంగా మీరు చేసే పని వల్ల పేదలకు అన్యాయం జరుగుతుంది. షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు. నేను షర్మిల, సునీతకు చెప్పాలని చూసినప్పటి నుండి నాతో కూడా మాట్లాడడం మానేశారు. షర్మిల, సునీతలు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు. గత ఐదేళ్లుగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. డబ్బు కోసమో, పదవులకోసమో నాకు తెలియదు.. కానీ ఏదో ఆశించి వాళ్లిద్దరూ ఇదంతా చేస్తున్నారు.
వైయస్ జగన్ సీఎం అయ్యాక బంధువర్గాన్ని ప్రభుత్వానికి దూరం పెట్టారు. బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండొద్దని చెప్పారు. వాళ్ల పనులు అవట్లేదనే ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నా. అవినాష్ రెడ్డి ఎదుగుతున్నాడని ఓర్చుకోలేకపోతున్నారు. మేనత్తగా చెబుతున్నా మీరు ఇప్పటికైనా మారండి. అవినాష్ గెలవాలని చివరి రోజువరకూ వివేకానంద రెడ్డి పనిచేశారు. ప్రజలంతా సీఎం వైయస్ జగన్ కి అండగా ఉండాలి. మంచి ఏదో చెడు ఏదో కడప ప్రజలు ఆలోచించాలి. అవినాష్ కు, వైయస్ జగన్ కు ఓట్లు వేసి గెలిపించాలి. షర్మిల చూపిస్తున్న సెంటిమెంట్ ను నమ్మవద్దు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించాలని విమల ఏపీ ప్రజల్ని కోరారు.