వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎన్నికల వేళ గత నెల రోజులుగా వైఎస్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా వైఎస్ జగన్, కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైయస్ అవినాష్ మీద షర్మిల, సునీత చేస్తున్న ఆరోపణలు మీడియాలో హైలెట్ అవుతూ వచ్చాయి. దీనికి టీడీపీ అనుకూల మీడియా తన వంతు పాత్ర పోషిస్తూ వస్తోంది. ఇప్పుడు వీటి మీద వైయస్ అవినాష్ తల్లి లక్ష్మి వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యకు సంచలన లేఖ రాశారు.
అందులో వైయస్ఆర్ మరణించాక జగన్ మనో వేదనకు గురి అయ్యాడు అని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా, 2009లో జగన్ను అందరూ ఒంటరి వాడిని చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినప్పుడు, మీ స్వార్థం మీరు చూసుకొని విజయమ్మ, జగన్ కు అండగా నిలబడకుండా వున్నపుడు జగన్ మనోవేదన మీకు గుర్తుకు రాలేదా, 2011 ఎలక్షన్లో వైఎస్ జగన్ కు అండగా నిలవాల్సింది పోయి నువ్వు, నీ కూతురు సునీత, అల్లుడూ నరెడ్డి రాజశేఖర్ రెడ్డి కలిసి జగన్ ను ఒంటరి చేసి ఆయన తల్లి విజయమ్మ గారి మీద పోటీ చేసినప్పుడు ఏమైపోయారు మీరు? పులివెందుల పూలంగళ్ళ సెంటర్లో మీ కూతురు సునీత, అల్లుడూ మాట్లాడిన మాటలకు జగన్ పడ్డ మనోవేదన గుర్తుకు రాలేదా,
వైఎస్ వివేకానందరెడ్డి జగన్ను సీఎంగా చూడాలని ఎంత కోరుకున్నారో, అవినాశ్ ను ఎంపీ గా చెయ్యాలని అంతే ఆశ పడ్డారు, ప్రచారం చేశారు. ఈ విషయం మీ కూతురు సునీత ఎన్నో సార్లు మీడియా ప్రతినిధుల సమక్షంలో చెప్పి ఈ రోజు కడప ఎంపీ కోసమే చంపారు అనడం మీకు తప్పుగా అనిపించడం లేదా, ఎవరిని కాపాడుకోవడం కోసం మీరు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నరు. మీరు నిజమైన న్యాయ పోరాటం చేస్తు ఉంటే జగన్ మీకు అండగా నిలబడతాడు. అలా కాకుండా జగన్ యొక్క శత్రువులతో చేతులు కలిపి వారు చెప్పినట్టు మాట్లాడుతూ, కేసుకు సంబంధం లేని వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటే జగన్ మిమ్మల్ని ఎలా సమర్ధిస్తారు అంటూ ప్రశ్నించారు.
నిజమైన హంతకులు మీలోనే ,మీతోనే వున్నారు, మీరు అవినాష్ మీద ప్రతిసారి తీవ్ర స్థాయిలో కేసు కోర్టులో వున్నా కూడా హంతకుడు అంటూ తీవ్ర పదజాలంతో తిట్టడం ఎంతవరకు సమంజసం, మీరు ఎవరినో కాపాడటం కోసం మీ స్వార్థంతో అమాయకులను కోర్టు చుట్టూ తిప్పుతూ ఎంతో మంది మనోవేదనకు కారణం అవుతున్నారు. ఇప్పటికైనా వైఎస్ఆర్, వైఎస్ జగన్ శత్రువుల చేతిలో పావులు కాకుండా నిజంగా వివేకానందను చంపిన వారికి శిక్ష పడటం కోసం పోరాటం చెయ్యండి మీకు జగన్, వైఎస్ కుటుంబ సభ్యులందరం అండగా వుంటాము.నిజం ఎంత లోతులో దాచిన దాగదు, తప్పకుండా బయట పడుతుంది అంటూ బహిరంగ లేఖ రాశారు.