ప్రేక్షకులకు స్వాగతం. మీరు విచ్చేశారు ప్రజాగళం పేరుతో జరిగే భజన కార్యక్రమానికి. తెలుగుదేశం అధినేతనైన చంద్రబాబు నాయుడనే నేను ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఈరోజు విపరీతంగా పొగుడుతాన్నానమాట. అలాగే కాసేపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మోదీపై నానా రకాలుగా ప్రేమ కురిపిస్తారని తెలియజేస్కుంటున్నాను. ఈ భజన కార్యక్రమం పోలింగ్ వరకు కొనసాగుతుంది. ఎవరూ ఎక్కడికి వెళ్లొద్దు వింటూనే ఉండండి.
‘దేశానికి రాబోయేది కొత్త ప్రధానే.. నరేంద్రమోదీ ఇకపై పీఎంగా ఉండరు. భారత రాజకీయాల్లో హుందాతనం మోదీ వల్ల కొరవడింది. ఈ విధమైన చౌకబారు వ్యాఖ్యలు, దిగజారుడు రాజకీయాలు గతంలో లేవు’ 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన ట్వీట్ ఇది. 2024 ఎన్నికలు వచ్చే సరికి తిట్టిన నోటితోనే పొగడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆదివారం చిలకలూరిపేట మండలంలో ప్రజాగళం పేరుతో టీడీపీ, జనసేన, బీజేపీల సభ జరుగుతుంది. ఇందులో మోదీ, పవన్ కూడా పాల్గొంటారు. గత ఎన్నికల్లో తిట్టుకున్న వీళ్లందరూ ఇప్పుడు ఒకరినొకరు పొగుడుకోనున్నారు. అందులో బాబు, పవన్ అయితే పోటీ పడి మరీ ప్రధానికి భజన చేయనున్నారు.
19 ఎన్నికల సమయంలో బాబు అండ్ గ్యాంగ్ బీజేపీ, మోదీని చాలా రకాలుగా తిట్టింది. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు రక్షణ ఉండదని నారా వారు సభల్లో చెప్పారు. ఢిల్లీలో దీక్షలు పెట్టి మోదీ ఎవరంటూ ప్రశ్నించారు. ఆయన వ్యక్తిగత విషయాలను మాట్లాడారు. పవన్ కూడా బీజేపీలో సేనను కలిపేది లేదని, పాచిపోయిన రెండు లడ్డూలంటూ ఒకానొక సందర్భంలో నోరు పారేసుకున్నారు.
ఇప్పుడు బాబు, పవన్ స్వార్థం కోసం ఎన్డీఏలో చేరారు. కొద్దిరోజులుగా ప్రధాని భజన ఒక రేంజ్లో జరుగుతోంది. ఇది మరికొంతకాలం కొనసాగుతుంది. ప్రజాగళం సభ సందర్భంగా టీడీపీ వీడియోలు చేసి మరీ వదిలింది. ఇందులో మోదీని గేమ్ ఛేంజర్ ఆఫ్ పాలిటిక్స్ అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి చూపించింది. పదేళ్లలో మోదీ అనేక విజయాలు సాధించారని, ఆయన వల్ల దేశం వెలగిపోయిందని బాబు చెప్పే అవకాశముంది. ఇక పవన్ అయితే సినిమా డైలాగ్లు వదిలేందుకు సిద్ధమయ్యారు. నాడు పోలవరాన్ని నారా వారు ఏటీఎంలా వాడేశారన్న మోదీ ఈరోజు ఏమంటారో..