జగన్ ప్రభుత్వంపై అసూయతో రగిలిపోతున్న ఎల్లోమీడియా ప్రభుత్వంపై విషప్రచారం చేయడం పనిగా పెట్టుకుంది. తాజగా “తాకట్టులో సచివాలయం” అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ఓ అసత్య కథనాన్ని ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ప్రజలలో భయాందోళనలు రేకెత్తించడమే ఈ కథనం ఉద్దేశ్యం.. సచివాలయాన్ని తాకట్టు పెట్టినట్లుగా వచ్చిన వార్తలను ఏపీ సీఆర్డీఏ సంస్థ అకౌంట్స్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఖండించారు.
కన్హార్టియం బ్యాంకులు, హడ్కోల నుంచి ఏపీ సీఆర్డీఏ పొందిన రుణాన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించటం జరిగిందని రాష్ట్ర సచివాలయంలోని అయిదు భవనాలు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుకు తాకట్టుపెట్టినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఐసీఐసీఐ, హెడీఎఫ్సీ బ్యాంకుల నుండి ఏపీ సీఆర్డీఏ ఎలాంటి ఋణం పొందలేదని ఆ సంస్థ అకౌంట్స్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
రాయపూడిలోని అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్ జీవో ఎంఎస్ నెంబరు: 332 ప్రకారం 2,060 కోట్ల రూపాయల రుణాన్ని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా మరియు ఇండియన్ బ్యాంకులు మంజూరు చేశాయి. ఈ రుణంలో రూ.1,955 కోట్లను మాత్రమే సీఆర్డీఏకు రిలీజ్ చేయటం జరిగింది. 2017వ సంవత్సరంలో హడ్కో రూ.1275 కోట్లను మౌలిక సదుపాయాల కొరకు రుణాన్ని మంజూరు చేయగా అందులో రూ.1,151 కోట్లు మాత్రమే సీఆర్డీఏకు విడుదల చేసింది. ఈ ఋణం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం కంఫర్ట్ లెటర్ జారీ చేయటం జరిగింది. ఆంధ్రజ్యోతి ప్రచురించిన విధంగా ఏపీ సీఆర్డీఏ సచివాలయ భవనాలను తాకట్టు పెట్టి ఏ విధమైన రుణాన్ని పొందలేదని అధికారులు వెల్లడించారు.
కాగా ఇలాంటి వాస్తవ దూర కథనాలను ప్రచురించిన సదరు పత్రికపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పిర్యాదు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం కానుంది. జగన్ ప్రభుత్వ పనితీరును ఓర్వలేకే ఇలాంటి అసత్య ప్రచారాలకు ఎల్లో మీడియా దిగజారడం ఆక్షేపణీయం. ఓ రాజకీయ పార్టీకి లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వంపై బురదజల్లే కథనాలను ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాకు ప్రజలు బుద్ది చెప్పే రోజు త్వరలోనే రానుంది.