– కంటైనర్ టెర్నినల్ తరలిపోదు
– స్పష్టం చేసిన పోర్టు సీఈఓ జీజే రావు
తప్పుడు ప్రచారం చేయడంలో తెలుగుదేశం, ఎల్లో మీడియా ముందుంటాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పరిశ్రమలు రాష్ట్రం వదిలి పోతున్నాయంటూ ఈ నాలుగున్నరేళ్లలో అనేకసార్లు ప్రచారం చేశారు. అయితే ఎవరూ వారిని నమ్మలేదు. తాజాగా నెల్లూరు జిల్లా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని అదానీ కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ఫిబ్రవరి 1 నుంచి మూత పడుతుందని టీడీపీ నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రచారం చేస్తున్నారు. దీనికి ఎల్లో మీడియా వంత పాడుతోంది. అయితే జనవరి 31 నుంచి కార్యకలాపాలు నిలిపివేస్తున్నామని, ఎగుమతులు, దిగుమతులు ఎన్నూరు, కాటుపల్లి పోర్టుల నుంచి జరుపుకోవాలని అదానీ కార్యాలయం నుంచి కంపెనీలకు ఈ-మెయిల్స్ పంపిందని సోమిరెడ్డి ఆరోపణ. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రైవేట్ టోల్గేట్ తెరిచి వసూళ్లకు పాల్పడటమేనని ఆయన వాదన.
ప్రసక్తే లేదు
పోర్టులోని కంటైనర్ టెర్మినల్ తరలిపోయే ప్రసక్తే లేదని పోర్టు సీఈఓ జీజే రావు స్పష్టం చేశారు. పోర్టు మూతపడుతుందని, కంటైనర్ టెర్మినల్ తరలిపోతుందని కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన కొట్టిపడేశారు. దేశంలో అదానీ గ్రూపునకు 14 పోర్టులు ఉన్నాయని, కొన్నింటిలో కార్గో తక్కువ ఉంటుందని, కొన్నింట్లో ఎక్కువ ఉంటుందన్నారు. కార్గో తగ్గిన పోర్టులను మూసివేయడమనేది జరగదన్నారు. ప్రస్తుతం ఇక్కడి పోర్టులో 14 బెర్తులున్నాయన్నారు. కార్గో పెరిగే కొద్దీ బెర్తుల సంఖ్య పెంచుతామన్నారు. రాబోయే నాలుగు సంవత్సరాల్లో 100 మిలియన్ టన్నులు హ్యాండిల్ చేస్తామన్నారు. అందుకు తగిన కార్గో ఉందన్నారు. ఈ దశలో కార్మికులను తగ్గించడం, తొలగించడం జరగేదిలేదన్నారు. పోర్టులో పనిచేసే కార్మికులు 75 శాతం స్థానికులేనని గుర్తు చేశారు.
ఏటా రెవెన్యూ
ఈ పోర్టు ద్వారా ప్రతి ఏటా ప్రభుత్వానికి ఇచ్చే రెవెన్యూ పెరుగుతోందని సీఈఓ తెలిపారు. 2020-21లో రూ.46 కోట్లు, 2021-22లో రూ.54 కోట్లు, 2022-23లో రూ.72 కోట్లు ప్రభుత్వానికి చెల్లించగా, 2023-24లో రూ.89 కోట్లు చెల్లించబోతున్నట్లు ఆయన గణాంకాలతో వివరించారు. ఈ దశలో పోర్టును మూసివేస్తామన్నది కలలో కూడా జరగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తోందని, ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పడుతున్నాయని సీఈఓ చెప్పారు. ఈ దశలో కార్గో కూడా పెరుగుతుందన్నారు. పోర్టుకు చెందిన సీఎస్సార్ నిధుల ద్వారా రూ.20 కోట్లతో ఫిషింగ్ జెట్టీ నిర్మాణమవుతోందని గుర్తు చేశారు.
కాకాణి ఖండన
కృష్ణపట్నం పోర్టు మూతపడుతుందని, కంటైనర్ టెర్మినల్ తరలిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధిపథంలో ఉన్న పోర్టుపై సోమిరెడ్డి బురద వేస్తున్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోర్టు నిర్మాణంలో వైఫల్యం చెందారని తెలిపారు. కొత్తగా రాజకీయ లబ్ధి కోసమే ఈ పన్నాగం పన్నుతున్నారన్నారు. టోల్గేట్ ఏర్పాటు చేసి లారీ ఓనర్ల దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు చెప్పడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి పోర్టును మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు. ఇంతమంది పోర్టు విషయంలో స్పష్టత ఇస్తున్నా సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు ఓడిపోయిన ఆయనకు ఈసారి టీడీపీ టికెట్ ఇస్తుందో లేదో కూడా తెలియదు. దీంతో సెన్సెషన్ కోసం, చంద్రబాబు దృష్టిలో పడేందుకు వేల మంది ఉపాధి పొందుతున్న పోర్టు విషయంలో దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలను అభిప్రాయపడుతున్నారు.