ఏపీలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఇంక పోరుకు సిధ్ధమైన పార్టీలన్నీ తమ శాయశక్తులా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నాయి. అతి ముఖ్యమైన మేనిఫెస్టో విడుదల ప్రక్రియకు సిధ్ధపడుతున్నాయి.
ఒకవైపు టీడీపీ పొత్తుతో మల్లగుల్లాలు పడుతుంటే, మరొక వైపు ఒంటరిపోరుతో వైసీపీ దూకుడుగా సిధ్ధం సభలంటూ దూసుకుపోతుంది. ఇక ఈ ఎన్నికల సమరం షురూ అవబోతున్న వేళ, వైసీపీ తన ఎన్నికల మేనిఫోస్టోను ఈనెల 20న విడుదల చేసేందుకు ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో మేనిఫెసైటోలో ఇచ్చిన హామీలను ఏ ప్రభుత్వమూ పూర్తి చేయనట్టు పూర్తి చేసి, ప్రజలే తన స్టార్ క్యాంపైనర్ అని గర్వంగా చెప్పుకున్న జగన్ మరి ఈసారి మేనిఫెస్టో లో ఏయే ఆకర్షణీయ పధకాలను, చేసిన అభివృద్ధిని, పూర్తి చేసిన ప్రోజెక్టులను అందులో చేరుస్తారో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే మేనిఫెస్టో డ్రాఫ్ట్ పూర్తయిందనీ, దీనిపై జగన్ ఆమోదం తెలపాల్సి ఉందని సమాచారం. డ్రాఫ్ట్స్ చేసిన మేనిఫెస్టోకి కొన్ని మార్పులు చేర్పులుపై ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. సోమ, మంగళవారాల్లో వీటిని పూర్తి చేసి 20వ తేదీన మేనిఫెస్టో విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ ఎన్నికలను వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వై నాట్ 175 అంటూ సీఎం జగన్ గడిచిన రెండేళ్ళుగా టార్గెట్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే సిధ్ధం సభలంటూ ప్రజల్లోనూ, పార్టీలోనూ, క్యాడర్లోనూ ఫుల్ జోష్ పెంచారు. గత ఎన్నికల్లో నవరత్నాలు ప్రకటించి వైసీపీ 151 సీట్లు గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఈసారి కూడా నవరత్నాలు తరహాలోనే అన్ని వర్గాల వారికి ఆకట్టుకొనేలా మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలు, రైతులు, యువత, నిరుద్యో గుల్ని దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టో రూపకల్పన జరిగిందని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంఇ. రైతులకు రుణమాఫీ, మహిళలకు వడ్డీ లేని రుణాల కొనసాగింపు, యువతకు ఉద్యోగాల కల్పనపై స్పష్టమైన హామీలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.