టీడీపీ సీనియర్ నేత ఒకప్పటి స్పీకర్, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు కుటుంబంలో తుని అసెంబ్లీ టికెట్ చిచ్చు రేపింది. యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 17న యనమల కృష్ణుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ వెన్నుపోటు ఉదంతం వేళ చంద్రబాబుకి ముఖ్యమంత్రి పదవి దక్కడంలో అత్యంత కీలక పాత్ర యనమల రామకృష్ణుడిదే. ఆ తరువాత అసెంబ్లీలో ఎన్టీఆర్ తన ఆవేదన చెప్పుకోవటానికి మైకు కూడా ఇవ్వకుండా ఆయన కన్నీటితో నిష్క్రమించటంలో యనమలది కీలక పాత్ర. ఈ ఘటన తరువాత యనమల రామకృష్ణుడు టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. ఆ క్రమంలో రాష్ట్ర రాజకీయాలపై రామకృష్ణుడు దృష్టిసారిస్తే తుని నియోజకవర్గ వ్యవహారాలన్నీ చక్కబెట్టిన నేతగా రామకృష్ణుడి తమ్ముడు యనమల కృష్ణుడుకి పేరుంది. కాగా 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన యనమల కృష్ణుడు ఓడిపోవడంతో ఈసారి ఆయనకు టీడీపీ టికెట్ నిరాకరించింది. ఈసారి టికెట్ యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు కేటాయించడంతో మనస్తాపానికి గురైన యనమల కృష్ణుడుతో మంత్రి దాడిశెట్టి రాజా, కన్నబాబు చర్చలు జరిపారు.
తుని టికెట్ యనమల దివ్యకు ఇవ్వడంపై కినుక వహించిన యనమల కృష్ణుడుతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధమయ్యారు.. ఇది టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి.. యనమల కృష్ణుడికి పార్టీలో మంచి స్థానం కల్పిస్తామన్న హామీతో ఈనెల 17 న వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఎన్నికలకు ఇంకో నెల రోజులు మాత్రమే గడువు ఉన్న తరుణంలో పార్టీలో ఇంకెన్ని చేరికలు ఉంటాయో వేచి చూడాలి..