మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఆశయాలను సాధించేందుకు కష్టపడి పనిచేస్తానని ఆయన కుమారుడు, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. నెహ్రూ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. నెహ్రు ఘాట్ వద్ద ఆయన విగ్రహానికి అవినాష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడారు. నెహ్రూ ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి పని చేశారు. ఐదుసార్లు శాసనభ్యునిగా, ఒకసారి మంత్రిగా ఉన్నారు. పేద ప్రజల కోసమే బతికారు. మాట ఇస్తే మడం తిప్పని నైజం ఆయనది. కార్యకర్తల కోసం ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండేవారు. నెహ్రూ చేసిన మంచి పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయి. విజయవాడ కొండ ప్రాంతాల ప్రజలు ఎప్పటికీ ఆయన్ను మరిచిపోరు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నెహ్రూని మించిన నాయకుడు మరొకరు లేరు. భౌతికంగా మన మధ్య లేకపోయినా అభిమానం అలాగే ఉంది. రాబోయే రోజుల్లో ప్రజా శ్రేయస్సు కోసం మరింత కష్టపడి పని చేస్తాం. నెహ్రూ అభిమానులు, అనుచరులు పేదలకు అండగా ఉంటారు. కార్యక్రమంలో సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉమ్మ కృష్ణా జిల్లా రాజకీయాల్లో నెహ్రూ మార్క్ చెరిగిపోనిది. 1982లో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి తన రాజకీయ జీవితం ప్రారంభించారు. నెహ్రూ మొదటగా ఎన్టీఆర్ మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖా మంత్రిగా పనిచేశారు. టీడీపీ సంక్షోభంలో రామారావుకు అండగా నిలబడ్డారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కుంబద్ధలు కొట్టినట్లు మాట్లాడడం ఆయన నైజం. ఇక అవినాష్ను చంద్రబాబు నాయుడు రాజకీయంగా వాడుకోగా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యం ఇచ్చి అవకాశాలు కల్పించారు.