‘నారా లోకేశ్ ఎందుకు దూర దూరంగా ఉంటున్నారు’ ప్రస్తుతం తెలుగుదేశం శ్రేణులను వేధిస్తున్న ప్రశ్న ఇది. పార్టీకి యువరాజుగా కీర్తించబడుతున్న వ్యక్తి సైలెంట్గా ఉండడానికి కారణాలేంటి? దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు అధిక ప్రాధాన్యం.. సీట్ల విషయంలో రచ్చ తదితర కారణాలతో చినబాబు చిన్నబోయి యాక్టివ్గా ఉండడం లేదని ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబు నాయుడి తనయుడిగా లోకేశ్ టీడీపీలో చాలాకాలంగా పెత్తనం చేస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికలు పార్టీకి జీవన్మరణ సమస్యగా మారాయి. దీంతో బాబు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. పవన్తో పొత్తు పెట్టుకున్నారు. ఎన్డీఏలో చేరారు. సీట్ల లెక్కలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. అన్నీ తానై పార్టీని నడిపిస్తున్న లోకేశ్ కొద్దిరోజులుగా సైలెంట్గా ఉన్నారు. బాబుతోపాటు చేరికల కార్యక్రమాల్లో కనిపించడం లేదు. సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి సేనానితో పొత్తని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.జనసేనతో పొత్తు లోకేశ్ ఇష్టం లేదు. తెలంగాణలో ఆ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపకపోవడంతో ఏపీలో కూడా అదే పరిస్థితి ఉంటుందని చినబాబు భావన. అందుకే వారితో కలవొద్దని చెప్పారని, కానీ చంద్రబాబు వినలేదని ప్రచారం ఉంది. బయటి నుంచే మద్దతు తీసుకుందామని చెప్పినా వినకపోవడమే కాకుండా ఏకంగా తొలుత 24 అసెంబ్లీ, మూడు ఎంపీ సీట్లు కేటాయించడంపై అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. తర్వాత సీట్ల సంఖ్య తగ్గించినా వారికి పది లోపే ఇచ్చుంటే బాగుండేదనే అభిప్రాయంలో ఉన్నట్లు చెబుతున్నారు.
సీట్ల విషయంలో కూడా చినబాబు వర్గానికి అన్యాయం జరిగిందని ప్రచారం ఉంది. రాజమహేంద్రవరం రూరల్ సీటును గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇవ్వడం లోకేశ్కు ఇష్టం లేదని తెలిసింది. తను పనికి రాడన్నట్లుగా మాట్లాడి.. జూనియర్ ఎన్టీఆర్ రావాలని చెప్పిన వ్యక్తికి సీటు ఇవ్వొద్దని పట్టుబట్టారని సమాచారం. కానీ బుచ్చయ్య ఒత్తిడికి బాబు లొంగిపోయి టికెట్ ఇవ్వడంతో చినబాబు అలకబూనారట. ఇక నెల్లూరు జిల్లాలో కావలి టికెట్ను తన మనిషి బీద రవిచంద్ర చెప్పిన వారికి ఇవ్వాలంటే వేరే వ్యక్తికి ఇచ్చారు. సర్వేపల్లి సీటును సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి వద్దని లోకేశ్ చెబితే ఇవ్వాల్సిందేనని బాబు చెప్పారట. దీంతో ఇది పెండింగ్లో పడిపోయింది. ఇంకా కొన్ని నియోజకవర్గాల విషయంలో పార్టీలో బాబు, చినబాబు వర్గాల మధ్య కోల్డ్ వార్ ఓ రేంజ్లో నడుస్తోందని తమ్ముళ్లే బాహాటంగా అంటున్నారు.
రా కదలి రా, తాడేపల్లిగూడెం ఉమ్మడి సభల్లో బాబు.. పవన్ను ఆకాశానికి ఎత్తేశారు. బీజేపీ పెద్దలతో జరిగిన చర్చల్లో పెద్దపీట వేశారు. అదే సమయంలో లోకేశ్ తన సభల్లో ఎక్కడా జనసేన, సేనాని ప్రస్తావన పెద్దగా లేకుండా జాగ్రత్త పడ్డారు. ఆదివారం నాటి ప్రజాగళం సభలో కూడా పవన్.. చంద్రబాబు ఒకరినొకరు పొగుడుకున్నారు. ఏర్పాట్లు మొత్తం చూసుకున్న లోకేశ్ మాత్రం పెద్దగా కనిపించలేదు. ఆయన ముఖంలోని బాధ చూసి చాలా మంది నాయకులు చర్చలు మొదలుపెట్టారు. చంద్రబాబు తర్వాత స్థానంలో చినబాబు ఉంటారనుకుంటే పవన్ ఎంట్రీతో లెక్కలు మారిపోయాయని చెబుతున్నారు. టీడీపీ అధినేత కొడుకు మాట కంటే సేనాని మాటకే ఎక్కువ విలువ ఇస్తున్నారని రెండు పార్టీల్లో గుసగుసలు మొదలయ్యాయి. జనసైనికులు కూడా లోకేశ్పై తీవ్ర కోపంగా ఉన్నారు. కూటమిలో బాబే సీఎం అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఆయనపై ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా చినబాబు టైం బాగోలేదు. తనకు తాను సర్ది చెప్పుకొని మంగళగిరికి వెళ్లి ప్రచారం చేసుకోవడమే మేలు. లేకపోతే మరిన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.