ఉమ్మడి కృష్ణాజిల్లా పెనమలూరు అసెంబ్లీ టిడిపి అభ్యర్థిపై నీలినీడలు కమ్ముకున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా 144 స్థానాలలో పోటీ చేస్తామని టీడీపీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో మొదటి విడతగా 94 మందిని, రెండో విడతలో 35 మందిని ప్రకటించింది. ఇలా ప్రకటించిన రెండు విడతల్లోనూ పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎవరి పోటీ చేస్తారనేది మాత్రం టీడీపీ ప్రకటించలేదు.ప్రస్తుతం పెనమలూరు టిడిపి ఇంచార్జ్ గా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఉన్నారు. బోడె ప్రసాద్ ను కాదని, మైలవరం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకొని టికెట్ ఖరారు చేసింది టీడీపీ అధిష్టానం.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన బోడె ప్రసాద్, ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రజాక్షేత్రంలో తిరుగుతూనే ఉన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో టిడిపి ఏ కార్యక్రమం తలపెట్టిన దానిని విజయవంతం అయ్యేలా చేశాడు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో పార్టీ కోసం బోడె ప్రసాద్ దాదాపు 30 కోట్ల మేర ఖర్చు చేసినట్లు సమాచారం. అయినా టిడిపి అధిష్టానం బోడె ప్రసాద్ కి టికెట్ నిరాకరించింది. ఆ మేరకు సరైన సమాచారం కూడా అందించలేదు. టిడిపి తరఫున టికెట్ వచ్చినా రాకపోయినా చంద్రబాబు ఫోటో పెట్టుకొని రానున్న ఎన్నికల్లో నిలబడతానని ఇప్పటికే బోడె ప్రసాద్ ప్రకటించాడు . అటు బోడే ప్రసాద్ తో పాటు ఇటు వసంత కృష్ణ ప్రసాద్ కి కూడా టికెట్ ఖరారు చేయలేదు. అంతలోనే పెనమలూరు సీట్ పై టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కన్ను పడింది. ఇప్పటికే ముగ్గురు నాయకులు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అంతలోనే చంద్రబాబు మరో కొన్ని కొత్త పేర్లతో ఐవిఆర్ఎస్ కాల్స్ చేయిస్తుండటం గమనార్హం.
సీనియర్ టిడిపి నాయకుడు, మాజీ మంత్రి, తెనాలి మాజీ శాసనసభ్యుడు ఆలపాటి రాజా, టిడిపి యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దేవినేని చందు పేర్లు కూడా పెనుమలూరులో పోటీకి పరిశీలిస్తున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా తెనాలి సీట్ జనసేనకి కేటాయించడంతో ఆలపాటి రాజాకి పోటీ చేసే స్థానం లేకుండా పోయింది. గన్నవరం ఎమ్మెల్యే వంశీ టిడిపికి దూరం కావడంతో గన్నవరం సీట్ ని దేవినేని చందు ఆశించాడు. కానీ గన్నవరం వైసిపి నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలోకి జాయిన్ కావడంతో ఆ సీట్ ని యార్లగడ్డ వెంకట్రావుకి కేటాయించారు. దీనితో దేవినేని చందుకి సీట్ లేకుండా పోయింది. ఇలా ఒకే స్థానంపై ముందుగానే ఇద్దరు పోటీ పడుతున్న తరుణంలో మరో రెండు కొత్త పేర్లు తీసుకొని వచ్చాడు చంద్రబాబు, ఇంతమంది పేర్లుతో సర్వే చేస్తున్న చంద్రబాబు నాయుడు చివరికి వీళ్లలో ఒకరి కేటాయిస్తాడో లేక కొత్తవారిని తీసుకొని వస్తాడో రానున్న రోజుల్లో తెలుస్తుంది.