– జనసేనకు ఇస్తే ఒప్పుకొనేది లేదంటున్న టీడీపీ సీనియర్లు
తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల పంపకం ఇంకా కొలిక్కి రాలేదు. కానీ ఎల్లో మీడియాలో మాత్రం అంతా అయిపోయింది. ప్రకటించేందుకు మంచిరోజు కోసం వెయిటింగ్ అంటూ వార్తలు వచ్చాయి. మరోవైపు కాపు నాయకుడు హరిరామజోగయ్య జనసేనాని పవన్ కళ్యాణ్కు సీట్ల విషయంలో తలంటుతూ మరో లేఖ వదిలారు. ఆ రెండు పార్టీల అధినేతలు సమావేశాల పేరుతో నాటకాలు ఆడుతుండగా.. టీడీపీ సీనియర్లు స్వరం పెంచారు. జనసేనకు సీట్లు ఇస్తే సహించేది లేదని అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు.
రాజమండ్రి రూరల్లో నేనే ఉంటా..
గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈసారి కూడా రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారనే వార్తలపై ఆయన ఘాటుగానే స్పందించారు. తాను సీనియర్ రాజకీయ నాయకుడినని, అధిష్టానం మాట వింటుందని చెప్పారు. అయితే ఈ స్థానం నుంచి తానే పోటీ చేస్తానని సేనకు చెందిన కందుల దుర్గేష్ ధీమాగా ఉన్నారు. పవన్ అభయం ఇచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై బుచ్చయ్య పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సీటు అడిగేందుకు ఆ దుర్గేష్ ఎవడన్నారు. తాజాగా అసెంబ్లీకి హాజరైన బుచ్చయ్య రాజమండ్రి రూరల్ సీటు తనదేనని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. మరి జనసేన ఏం చేస్తుందో..
కన్నమేనా..
బీజేపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి సీటు విషయంలో ఇంకా పూర్తి స్థాయి హామీ రాలేదని తెలుస్తోంది. కన్నానే బరిలో ఉంటారని చంద్రబాబు ప్రకటించినా.. కాదు జనసేన నుంచి బొర్రా వెంకట అప్పారావు, బోనబోయిన శ్రీనివాస్లకు అవకాశం ఉంటుందని వారి అనుచరులు హంగామా చేస్తున్నారు. ఇంకోవైపు టీడీపీలోని వర్గాలు కన్నాకు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఆయన నాకు స్పష్టమైన హామీ ఇవ్వండి మహాప్రభో అంటూ బాబును బతిమిలాడుకుంటున్నారు.
పాపం ఆటపాటి
టీడీపీలో ఉన్న సీనియర్లలో మాజీ మంత్రి ఆలపాటి రాజా ఒకరు. తెనాలి సీటు విషయంలో ఆయన ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడి నుంచి జనసేన ముఖ్య నాయకుడు, పవన్ సన్నిహితుడు నాదెండ్ల మనోహర్ పోటీ చేయాలని చూస్తున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో బాబు కూడా సేనకు ఇచ్చేందుకు ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. దీంతో రాజా వర్గం అలకపాన్పు ఎక్కింది. దీంతో రాజా 8వ తేదీ వరకు వేచి చూద్దామని వారిని బుజ్జగించాల్సి వచ్చింది. పార్టీలో అత్యంత సీనియర్ అయిన తనకే టికెట్ ఇవ్వాలని, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ఆలపాటి సన్నిహితుల వద్ద చెబుతున్నారు.
నారాయణకు వద్దు.. మాకే కావాలి
నెల్లూరు సిటీ సీటు మాజీ మంత్రి పొంగూరు నారాయణకే ఖారారైందని ఎల్లో మీడియాలో వార్తలు వచ్చాయి. మరోవైపు జగన్ సామాన్యుడైన ముస్లిం వ్యక్తి ఖలీల్ను సమన్వయకర్తను చేశారు. దీంతో జనసేన నాయకులు ఆవేదనలో మునిగిపోయారు. ఈ స్థానం కావాలని పలుమార్లు పవన్ను అడిగినా స్పందించలేదు. నారాయణ నేనే పోటీ చేస్తానంటూ గట్టిగా చెబుతున్నారు. దీంతో సేన నేతలు తెలివిగా సినీ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ను రంగంలోకి దించారు. దీనిపై నారాయణ వర్గం మండిపడుతోంది. పార్టీకి ఆర్థిక స్తంభంగా ఉన్న వ్యక్తి విషయంలో ఇలా చేయడం తగదని పొత్తులో ఉన్న సేనకు చెబుతోంది. అయితే ఎవరూ తగ్గడం లేదు. మొత్తంగా తెలుగుదేశం, జనసేన నేతల మధ్య మాటల యుద్ధాలు నడుస్తున్నాయి. టీడీపీ సీనియర్లు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. బాబు ఏం చేస్తారో మరి..